ఆసియా వైవిధ్యమే శ్రీసభ బలం – FABC అధ్యక్షుడు
Federation of Asian Bishops' Conferences (FABC) అధ్యక్షుడు కార్డినల్ ఫిలిప్ నేరి ఫెర్రావో, ఆసియాలోని అపారమైన వైవిధ్యాన్ని శ్రీసభకు లభించిన అత్యంత గొప్ప వరాల్లో ఒకటిగా అభివర్ణించారు. ఈ వైవిధ్యమే ఆసియాలోని స్థానిక శ్రీసభలను ఒకే సేవా లక్ష్యంతో ఐక్యం చేస్తోందని ఆయన పేర్కొన్నారు.
జూలై 21న జకార్తాలోని హోటల్ ములియా బాల్రూమ్లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించిన కార్డినల్ ఫెర్రావో, ఈ సమావేశమే ఆసియా శ్రీసభ సౌందర్యానికి ప్రతిబింబమని అన్నారు. విభిన్న సంస్కృతులు, భాషలు, సంప్రదాయాలు ఐక్యతలో కలిసిపోయే అందాన్ని ఇది చాటిచెబుతోందని తెలిపారు.
"ఆసియా ఖండం తన రంగురంగుల వైవిధ్యం, సౌందర్యంతో ప్రత్యేకతను సంతరించుకుందని నేను గతంలో కంటే ఇప్పుడు మరింత బలంగా విశ్వసిస్తున్నాను. ఆసియాలో మనం భిన్నత్వంలో ఏకత్వాన్ని జరుపుకుంటున్నాం," అని కార్డినల్ అన్నారు.
ఇండోనేషియా సాంస్కృతిక వారసత్వాన్ని సాంప్రదాయ సంగీతం, నృత్యాలు, ప్రారంభ దివ్యబలిపూజ ద్వారా ప్రతిబింబించిన కార్యక్రమం అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమం ద్వారా పాల్గొన్న ప్రతినిధులు ఇండోనేషియా సాంస్కృతిక సంపదను ప్రత్యక్షంగా అనుభవించే అవకాశం పొందారు.
ఈ సాంస్కృతిక వ్యక్తీకరణలు, వైవిధ్యం, శ్రీసభ సేవకు అడ్డంకి కాదని, ఆసియా అంతటా తన సాక్ష్యాన్ని మరింత బలోపేతం చేసే వరమని స్పష్టంచేశాయని కార్డినల్ ఫెర్రావో అన్నారు.
FABC చరిత్రను స్మరించుకుంటూ, 1970లో పరిశుద్ధ ఆరవ పాల్ పాపు గారు ఫిలిప్పీన్స్ను సందర్శించిన అనంతరం ఈ సమాఖ్య ఆవిర్భవించిందని ఆయన గుర్తుచేశారు. ఆ చారిత్రక పర్యటన ఆసియా పీఠాధిపతుల మధ్య మరింత సన్నిహిత సహకారానికి ప్రేరణనిచ్చిందని తెలిపారు. అలాగే పరిశుద్ధ రెండవ జాన్ పాల్ పాపు గారు, పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు చేసిన పాస్టరల్ పర్యటనలను కూడా ప్రస్తావిస్తూ, ఆసియా ప్రజలతో వారి సన్నిహిత కలయిక విశ్వవ్యాప్త శ్రీసభ ఈ ఖండానికి ఎంత దగ్గరగా ఉందో తెలియజేసిందని అన్నారు.
ప్రసంగంలో ఒక ఆహ్లాదకరమైన సందర్భాన్ని పంచుకున్న కార్డినల్ ఫెర్రావో, 2015లో పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు శ్రీలంక, ఫిలిప్పీన్స్ పర్యటన సందర్భంగా జరిగిన ఒక సంఘటనను గుర్తుచేశారు. ఫిలిప్పీన్స్లోని ఒక జేసుసభ ప్రాంతీయాధికారి, శ్రీలంకలాగా 25 ఏనుగులతో పరిశుద్ధ పాపు గారికి స్వాగతం పలకలేకపోయినా, 25 మంది జేసుసభ విద్యార్థి గురువులను సమర్పిస్తున్నానని సరదాగా చెప్పారని వివరించారు. అందుకు పరిశుద్ధ పాపు గారు చిరునవ్వుతో, "శ్రీలంకలోని ఏనుగులే మరింత చక్కగా అలంకరించబడ్డాయి," అని చెప్పడంతో సభికులు నవ్వుల్లో మునిగిపోయారని ఆయన తెలిపారు.
FABC తరఫున, ప్లీనరీ సమావేశానికి ఆతిథ్యం ఇచ్చి, వారంరోజుల కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న ఇండోనేషియా కతోలిక పీఠాధిపతుల సమాఖ్యకు కార్డినల్ ఫెర్రావో కృతజ్ఞతలు తెలిపారు.
"ఈ ప్లీనరీ సమావేశం సజావుగా జరగడానికి అత్యుత్తమ ఏర్పాట్లు చేసిన ఇండోనేషియా కతోలిక పీఠాధిపతుల సమాఖ్యకు మేము ఎంతో రుణపడి ఉన్నాము. ఇక్కడ మాకు నిజంగా సొంత ఇంటిలో ఉన్న అనుభూతిని కలిగించారు," అని ఆయన అన్నారు.
ప్రతినిధుల రాకపోకలు సాఫీగా జరిగేలా సహకరించిన ఇండోనేషియా ప్రభుత్వానికి, ముఖ్యంగా మత వ్యవహారాల మంత్రి నసరుద్దీన్ ఉమర్ కు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ప్రారంభోత్సవంలో నుసంతర నృత్య బృందం సుమత్రా, జావా, నుసా తెంగ్గారా ప్రాంతాల సంప్రదాయాలను ప్రతిబింబించే నృత్యాలను ప్రదర్శించింది. ఈ ప్రదర్శనలు ఆసియా నలుమూలల నుంచి వచ్చిన ప్రతినిధులకు స్వాగతం పలకడంతో పాటు, భిన్నత్వంలో ఏకత్వం అనే సమావేశ ప్రధాన సందేశాన్ని ప్రతిధ్వనింపజేశాయి.
తన ప్రసంగాన్ని ముగిస్తూ, ఇండోనేషియా దేశానికి, ప్రజలకు, నాయకులకు దేవుని ఆశీర్వాదాలు ఉండాలని కార్డినల్ ఫెర్రావో ప్రార్థించారు. ఈ ప్లీనరీ సమావేశం ఆసియాలోని స్థానిక శ్రీసభల మధ్య ఐక్యతను మరింత బలోపేతం చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆసియాలో అనేక భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలు ఉన్నప్పటికీ, ఆ వైవిధ్యమే శ్రీసభ సేవకు ఐక్యతను, బలాన్ని అందించే మూలంగా నిలుస్తుందని ప్రపంచానికి సాక్ష్యమివ్వడానికి ఈ సమావేశం ఒక గొప్ప అవకాశమని ఆయన పేర్కొన్నారు.