ఆసియాలో శ్రీసభ ఒంటరిగా తన సేవను నెరవేర్చలేదు: FABC ప్రధాన కార్యదర్శి
ఇండోనేషియాలోని జకార్తాలో జూలై 20–26 తేదీల్లో జరగనున్న Federation of Asian Bishops' Conferences (FABC) 12 వ ప్లీనరీ సమావేశానికి ఆసియాలోని కతోలిక శ్రీసభ సిద్ధమవుతున్న సందర్భంగా, FABC ప్రధాన కార్యదర్శి, జపాన్లోని టోక్యో అగ్రపీఠాధిపతి కార్డినల్ టార్సిసియో ఇసావో కికుచి, SVD, సమాజంతో మరింత లోతైన అనుబంధాన్ని పెంపొందించుకోవాలని శ్రీసభకు పిలుపునిచ్చారు. శ్రీసభ ఒంటరిగా తన సేవను నెరవేర్చలేదు అని ఆయన అన్నారు.
ప్లీనరీ సమావేశానికి ముందు రేడియో వెరిటాస్ ఆసియా (RVA)తో పంచుకున్న సందేశంలో, "సినడల్ పరివర్తనకు పిలుపు – ఆసియాలో వారధులు మరియు వారధుల నిర్మాణకర్తలుగా ఉండే శ్రీసభ సేవ" అనే సమావేశ అంశంపై కార్డినల్ కికుచి స్పందించారు. ఆసియాలోని భిన్న సంస్కృతులు, మతాలు, సమాజాల మధ్య ప్రజలతో కలిసి నడవాలని శ్రీసభకు ఈ అంశం ఆహ్వానం పలుకుతోందని ఆయన చెప్పారు.
"ఆసియాలోని సమాజాల భిన్నమైన వాస్తవికతల మధ్య, శ్రీసభగా మనం ఎక్కువగా అల్పసంఖ్యాక సమాజమే," అని కార్డినల్ కికుచి పేర్కొన్నారు.
"కతోలిక శ్రీసభగా మనం ఏకాంతంగా జీవించడం లేదు. ఆసియాలోని సమాజంతో, ఇతర మత సమాజాలతో, విభిన్న సంస్కృతులతో, భాషలతో మనకు సజీవమైన సంబంధాలు ఉన్నాయి," అని ఆయన అన్నారు.
ఈ వాస్తవికత దృష్ట్యా, సినడాలిటీని కేవలం శ్రీసభ అంతర్గత ప్రక్రియగా మాత్రమే కాకుండా, ప్రపంచంతో అనుబంధం ఏర్పరచుకునే జీవన విధానంగా కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని కార్డినల్ కికుచి వివరించారు.
"సినడాలిటీ గురించి మాట్లాడేటప్పుడు మన అంతర్గత సంబంధాల గురించి మాత్రమే కాదు, మన వాస్తవికతను ప్రతిబింబించే బాహ్య సంబంధాల గురించి కూడా మాట్లాడాలి," అని ఆయన అన్నారు. ఆసియాలో శ్రీసభ సేవలో మతాంతర సంభాషణ ఎప్పటినుంచో కీలకమైన అంశంగా కొనసాగుతోందని ఆయన గుర్తుచేశారు.
ఆసియా వాస్తవికతల మధ్య సినడాలిటీ అనేది పరివర్తనకు పిలుపు, ప్రవచనాత్మక సేవకు పిలుపు అని ఆయన పేర్కొన్నారు. వేగంగా మారుతున్న సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితులకు శ్రీసభ ఎలా స్పందించాలో పరిశుద్ధాత్మ మార్గదర్శకత్వంలో వివేచించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
ఆసియాలో హింస, పేదరికం, అనారోగ్యం వంటి ఎన్నో సవాళ్లు ఉన్నప్పటికీ, ఈ ఖండమంతటా నిరీక్షణ, కొత్త అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని కార్డినల్ కికుచి తెలిపారు.
"ప్లీనరీ సమావేశం ద్వారా ఆసియాలోని శ్రీసభలకు పరిశుద్ధాత్మ అందిస్తున్న పిలుపును మనం వివేచించడానికి ప్రయత్నిస్తాము," అని ఆయన అన్నారు. "ప్రస్తుత సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక వాస్తవికతలు శ్రీసభపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో పరిశీలించి, సినడల్ స్ఫూర్తితో వాటికి విశ్వాసపూర్వకంగా, సృజనాత్మకంగా ఎలా స్పందించాలనే దానిపై మనం ఆలోచిస్తాము," అని ఆయన వివరించారు.
సినడాలిటీ అనేది కేవలం ఒక భావనగానీ, సంస్థాగత సంస్కరణగానీ మిగిలిపోకూడదని కార్డినల్ కికుచి స్పష్టం చేశారు.
"సినడాలిటీని ఒక అమూర్త భావనగా లేదా నిర్మాణాత్మక మార్పుగా మాత్రమే చూడకూడదు. అది శ్రీసభ సేవను, మన సాక్ష్యజీవితాన్ని మలిచే జీవన వాస్తవికతగా మారాలి," అని ఆయన అన్నారు.
కార్డినల్ కికుచి అభిప్రాయం ప్రకారం, సినడల్ శ్రీసభగా మారడం అంటే వారధిగా ఉండడమే కాకుండా, వారధుల నిర్మాణకర్తగా కూడా మారడం.
"ఆసియాలోని ఈ క్లిష్ట పరిస్థితుల మధ్య ప్రయాణిస్తూ, విభిన్న పరిస్థితుల్లో ఉన్న ప్రజల మధ్య వారధులుగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. కలిసి నడవడానికి, ఒకరికి ఒకరు తోడుగా నిలవడానికి, ప్రేమతో, శాంతితో, సయోధ్యతో, ఐక్యతతో, పరస్పర సహకారంతో, దయతో, పరస్పర అంగీకారంతో కలిసి ప్రార్థించడానికి మేము వారధులుగా ఉండాలని ఆశిస్తున్నాము," అని ఆయన చెప్పారు.
సమస్యలకు కేవలం పరిష్కారాలను అందించడం మాత్రమే కాదు, మరింత న్యాయపూర్వకమైన, కరుణతో కూడిన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరినీ భాగస్వాములుగా ఆహ్వానించడం కూడా శ్రీసభ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.
"మనం కేవలం వారధులను నిర్మించి ఇవ్వడం మాత్రమే కాదు; ప్రతి ఒక్కరూ కలిసి వారధులను నిర్మించే పనిలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాము. మన సినడాలిటీ, మన సేవ కేవలం పరిష్కారాలను అందించడమే కాదు; అందరూ కలిసి ఉమ్మడి పరిష్కారాలను కనుగొనేలా పనిచేయడం. అప్పుడు ప్రతి ఒక్కరూ వారధులను నిర్మిస్తూ, దేవుడు ప్రసాదించిన అమూల్యమైన మానవ గౌరవాన్ని ప్రేమతో కాపాడుకుంటూ, ఒకరికి ఒకరు తోడుగా నిలవగలుగుతారు," అని ఆయన అన్నారు.
వారం రోజుల పాటు జరిగే FABC 12 వ ప్లీనరీ సమావేశంలో, ఆసియా నలుమూలల నుంచి వచ్చిన పీఠాధిపతులు పాల్గొని, ప్రాంతంలోని విభిన్న పాస్టోరల్, సామాజిక వాస్తవికతలకు స్పందిస్తూ, శ్రీసభలో ఐక్యత, భాగస్వామ్యం, సువార్త ప్రకటనా సేవలను మరింత బలోపేతం చేసే మార్గాలను పరిశుద్ధాత్మ మార్గదర్శకత్వంలో వివేచించనున్నారు.