కార్డినల్ డేవిడ్: శ్రీసభ ‘బాబేలు నిర్మాణకర్తలు’గా కాదు, ‘ఐక్యతను నిర్మించేవారిగా’ ఉండాలి

కార్డినల్ డేవిడ్
FABC ఉపాధ్యక్షుడు కార్డినల్ పాబ్లో వర్జిలియో డేవిడ్ మాట్లాడుతూ, ప్రతి నిర్ణయంలో దేవుణ్ణి పరమ లక్ష్యంగా ఉంచుతూ, మానవ వ్యక్తిని కేంద్రంగా నిలబెట్టాలని శ్రీసభకు పిలుపునిచ్చారు. (ఫోటో: CBCP NEWS)

Federation of Asian Bishops' Conferences (FABC) 12 వ ప్లీనరీ సమావేశం ఇండోనేషియాలోని జకార్తాలో జరగనున్న నేపథ్యంలో, FABC ఉపాధ్యక్షుడు కార్డినల్ పాబ్లో వర్జిలియో డేవిడ్, ఆసియాలోని శ్రీసభలకు పరిశుద్ధ లియో పాపు గారు అందించిన సందేశాన్ని ప్రతిధ్వనిస్తూ, శ్రీసభ "బాబేలు నిర్మాణకర్తలుగా కాకుండా, ఐక్యతను నిర్మించేవారిగా" మారాలని పిలుపునిచ్చారు.

ప్లీనరీ సమావేశానికి ముందు విడుదల చేసిన తన ఆలోచనల్లో, పరిశుద్ధ పాపు గారు అందించిన సందేశాన్ని, అలాగే కార్డినల్ ఓస్వాల్డ్ గ్రాసియాస్‌ను ఈ సమావేశానికి  ప్రత్యేక ప్రతినిధిగా నియమించడాన్ని ఆయన హర్షించారు. ప్లీనరీ సమావేశం కోసం సినడల్ పరివర్తన అనే అంశాన్ని వివేచించిన FABC సినడాలిటీ కమిటీ ఇప్పటికే చేపట్టిన ఆలోచనా ప్రక్రియతో పరిశుద్ధ తండ్రి గారి సందేశం ఎంతో లోతుగా అనుసంధానమై ఉందని ఆయన పేర్కొన్నారు.

ఈ సినడల్ ప్రయాణానికి ప్రతీకలుగా జక్కయ్య మరియు నతానియేలు అనే ఇద్దరు సువార్త వ్యక్తులను కమిటీ పరిశీలించిన విషయాన్ని కార్డినల్ డేవిడ్ గుర్తు చేశారు. జక్కయ్యను యేసు "చెట్టుమీద నుంచి దిగిరా" అని పిలవగా, నతానియేలు క్రీస్తును కలుసుకున్న తర్వాత "ఇంతకంటే గొప్ప సంగతులను చూస్తావు" అనే వాగ్దానాన్ని పొందాడు. చివరికి కేంద్ర కమిటీ నతానియేలును సమావేశానికి ప్రేరణగా ఎంచుకున్నప్పటికీ, ఈ ఇద్దరూ పరివర్తన ప్రయాణంలోని పరస్పరపూరక దశలను సూచిస్తారని ఆయన వివరించారు.

"జక్కయ్య అంటే దిగివచ్చే ప్రయాణానికి ప్రతీక. అంటే అహంకారం, ప్రత్యేక హక్కులు, స్వయంసమృద్ధి అనే చెట్లపై నుంచి దిగివచ్చే పిలుపు," అని ఆయన అన్నారు. "నతానియేలు అంటే పైకి ఎదిగే ప్రయాణానికి ప్రతీక. క్రీస్తుతో వ్యక్తిగత సాక్షాత్కారం ద్వారా 'గొప్ప సంగతులను' దర్శించే ఆధ్యాత్మిక అనుభవం," అని ఆయన వివరించారు.

శ్రీసభ బాబేలు గోపురం సూచించే విభజనలను పునరావృతం చేయకుండా, ఐక్యతను నిర్మించాలన్న పరిశుద్ధ తండ్రి గారి పిలుపు, ఇదే సినడల్ పరివర్తన ప్రయాణాన్ని మరో కోణంలో వ్యక్తపరుస్తుందని కార్డినల్ డేవిడ్ పేర్కొన్నారు. ప్రతి నిర్ణయంలో దేవుణ్ణి పరమ లక్ష్యంగా ఉంచుతూ, అదే సమయంలో మానవ వ్యక్తిని కేంద్రంగా నిలబెట్టి, ఆధునిక ప్రపంచంలోని వాస్తవికతలు, సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవాలని శ్రీసభకు ఈ పిలుపు ఆహ్వానిస్తోందని ఆయన చెప్పారు.
 

కార్డినల్ డేవిడ్
ఆసియాలోని గొప్ప వైవిధ్యాన్ని ప్రస్తావిస్తూ, విశ్వశ్రీసభకు అందించడానికి ఈ ఖండానికి ఒక ప్రత్యేకమైన తోడ్పాటు ఉందని కార్డినల్ డేవిడ్ పేర్కొన్నారు. (ఫోటో: The Filipino Times)

క్రీస్తే దేవునికీ మానవాళికీ మధ్య ఉన్న నిజమైన వారధి అని కార్డినల్ డేవిడ్ పేర్కొన్నారు. నిజమైన సినడల్ పరివర్తన అంటే ప్రజలతో, సంస్కృతులతో, మతాలతో, పేదలతో, సమస్త సృష్టితో వారధులను నిర్మించే క్రీస్తు మార్గంలో మనల్ని మనం నడిపించుకోవడమేనని ఆయన వివరించారు.

ఆసియాలోని గొప్ప వైవిధ్యాన్ని ప్రస్తావిస్తూ, విశ్వశ్రీసభకు అందించడానికి ఆసియా ఖండానికి ఒక ప్రత్యేకమైన కానుక ఉందని ఆయన అన్నారు. ఏకరూపతను సాధించడం కాదు, సంభాషణ, పరస్పర సాక్షాత్కారం, పరస్పర గౌరవం ద్వారా నిజమైన ఐక్యతకు సాక్ష్యమివ్వడమే ఆసియాలోని శ్రీసభల పిలుపు అని ఆయన స్పష్టం చేశారు.

చివరగా, నతానియేలు స్ఫూర్తితో శ్రీసభ "ఇంతకంటే గొప్ప సంగతులను" దర్శించగలదనే ఆశాభావాన్ని కార్డినల్ డేవిడ్ వ్యక్తం చేశారు. "ఐక్యత, భాగస్వామ్యం, సువార్త ప్రకటనా సేవ" అనే సినడల్ స్ఫూర్తితో పీఠాధిపతులు, గురువులు, కన్యస్త్రీలు, సామాన్య విశ్వాసులు కలిసి ముందుకు సాగుతుండగా, ఈ ప్లీనరీ సమావేశాన్ని పరిశుద్ధాత్మ మార్గదర్శకత్వానికి ఆయన సమర్పించారు.

Telugu Survey Popup Image