ఎబోలా సంక్షోభంపై ఆందోళన వ్యక్తం చేసిన పోప్
డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశ చరిత్రలోనే రెండో అతిపెద్ద ఎబోలా వ్యాప్తి కొనసాగుతోంది.
ఇప్పటివరకు 2600 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. వైరస్ సోకిన వారిలో మరణాల రేటు 47.9 శాతంగా ఉంది.
వాటికన్లోని సెయింట్ పీటర్స్ స్క్వేర్లో నిర్వహించిన త్రికాల ప్రార్థనలో పోప్ లియో ఎబోలా బాధితులను స్మరించుకున్నారు.
అంతర్జాతీయ సమాజం స్పందించి, స్థానిక ప్రజలను కూడా నివారణ చర్యల్లో భాగస్వామ్యం చేయాలని కోరారు.
కాంగోకు ఇప్పటికే ఎబోలా వ్యాక్సిన్ తొలి డోసులు చేరాయి. ఇప్పటివరకు 2800 పైగా కేసులు నిర్ధారణ కాగా, సుమారు 800 మంది ప్రస్తుతం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు.
ఇదిలా ఉంటే, కాంగోకు ఉత్తరంగా ఉన్న సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్లో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. జాంబోయే ప్రాంతంలో బంగారు గనిలో కొండచరియలు విరిగిపడటంతో వంద మందికి పైగా మృతి చెందారు.
ఈ బంగారు గని ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహించడంతో పాటు, కార్మికుల భద్రతకు అవసరమైన రక్షణ చర్యలు కూడా చేపట్టలేదని అధికారులు తెలిపారు.
ఈ ఘటనలో పెద్ద సంఖ్యలో యువకులు ప్రాణాలు కోల్పోవడంపై పట్టణ డిప్యూటీ మేయర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జీవనోపాధి కోసం తప్పనిసరి పరిస్థితుల్లోనే వారు ఈ ప్రమాదకరమైన పనిని చేయాల్సి వచ్చిందని ఆయన తెలిపారు.
గని ప్రమాదంలో మృతి చెందిన వారిని కూడా పోప్ లియో స్మరించుకున్నారు. అన్ని గనుల్లో భద్రతా ప్రమాణాలు, చట్టాలను తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.
