FABC ప్లీనరీ మహాసభకు ముందు విశ్వాస వారధుల నిర్మాణ ధ్యేయాన్ని చాటిచెబుతున్న ఇండోనేషియా కతోలిక సంఘం
జూలై 20 నుండి 26 వరకు జకార్తాలో జరగనున్న ఆసియా పీఠాధిపతుల సమాఖ్య (FABC) ప్లీనరీ మహాసభ కోసం ఆసియా ఖండంలోని కతోలిక పీఠాధిపతులు సమాయత్తమవుతున్న వేళ, ప్రపంచంలోనే అత్యంత మత, సాంస్కృతిక వైవిధ్యం కలిగిన దేశాల్లో ఒకటైన ఇండోనేషియాలోని కతోలిక సంఘం సంభాషణ, సినొడాలిటీ, వంతెనల నిర్మాణం పట్ల తన నిబద్ధతను మరోసారి పునరుద్ఘాటిస్తోంది.
"సినొడల్ పరివర్తన మరియు ఆసియాలో వంతెనలుగా, వంతెనలను నిర్మించేవారిగా ఉండే సంఘం యొక్క ధ్యేయం" అనే ప్రధాన అంశంతో నిర్వహించబడనున్న ఈ మహాసభలో ఆసియా నలుమూలల నుంచి పీఠాధిపతులు, సంఘ నాయకులు పాల్గొని, వేగంగా మారుతున్న ఆసియా సామాజిక, సాంస్కృతిక, మతపరమైన పరిస్థితుల నేపథ్యంలో సంఘం నిర్వర్తించాల్సిన బాధ్యతలపై లోతైన ఆలోచన చేయనున్నారు.
ఇండోనేషియా కతోలిక సంఘానికి ఈ మహాసభకు ఆతిథ్యం ఇవ్వడం కేవలం జాతీయ గౌరవానికి మాత్రమే పరిమితం కాదు. మత, జాతి, సంస్కృతుల మధ్య సంభాషణను తన విశ్వాస జీవితంలో అంతర్భాగంగా మలుచుకున్న అనుభవాన్ని ఆసియా సంఘంతో పంచుకునే అరుదైన అవకాశంగా దీనిని భావిస్తోంది.
జకార్తాలోని యూనివర్సిటాస్ ఇండోనేషియాలోని సస్టైనబుల్ డెవలప్మెంట్ గ్రాడ్యుయేట్ స్కూల్ అధ్యాపకురాలు డా. మరియా పుస్పితాసారి అభిప్రాయం ప్రకారం, ఇండోనేషియా కతోలిక సంఘం ప్రత్యేకమైన పాస్టోరల్ అనుభవాన్ని సంపాదించింది. అది ఆసియా సంఘానికి విలువైన మార్గదర్శకత్వాన్ని అందించగలదని, అదే సమయంలో సంఘం నిరంతర నవీకరణకు అవసరమైన కొన్ని సవాళ్లను కూడా ఎదుర్కొంటోందని ఆమె పేర్కొన్నారు.
డా. పుస్పితాసారి జకార్తా మహామేత్రాసనం పరిధిలోని లౌకిక అపోస్తోలేట్ కమిషన్ మరియు సామాజిక ప్రసార మాధ్యమాల కమిషన్లో కూడా సేవలందిస్తూ, లౌకికుల భాగస్వామ్యం, పాస్టోరల్ సమాచార ప్రసారం, సువార్త ప్రకటనా రంగాల్లో విశేషంగా కృషి చేశారు.
ఆమె అభిప్రాయం ప్రకారం, ఆసియా సంఘానికి ఇండోనేషియా అందించగల అత్యంత గొప్ప కానుక వైవిధ్యాన్ని విభజనకు కారణంగా కాకుండా పరస్పర కలయికకు అవకాశంగా స్వీకరించిన అనుభవం.
ప్రపంచంలో అత్యధిక ముస్లిం జనాభా కలిగిన దేశంలో మైనారిటీగా జీవిస్తున్న కతోలిక సంఘం, సంభాషణను ఒక సందర్భోచిత కార్యక్రమంగా కాకుండా, జీవన విధానంగా మలుచుకుంది. మత స్వేచ్ఛ, పరస్పర గౌరవం, జాతీయ ఐక్యతకు ప్రాధాన్యం ఇచ్చే ఇండోనేషియా జాతీయ సిద్ధాంతమైన పంచశీల (Pancasila) ఆధారంగా, కాథలికులు ఇతర మతాల ప్రజలతో కలిసి శాంతి, సామాజిక సామరస్యం, మానవ గౌరవం కోసం నిరంతరం సేవలందిస్తున్నారు.
"ఈ అనుభవం FABC ఎన్నో దశాబ్దాలుగా ప్రతిపాదిస్తున్న దృక్పథానికి సరిగ్గా ప్రతిబింబం. ఆసియాలో సంఘం ప్రత్యేకత అనేది మతాలు, సంస్కృతులు, ప్రజలతో సంభాషణలోనే ఉంది," అని డా. పుస్పితాసారి పేర్కొన్నారు.
ఆమె అభిప్రాయం ప్రకారం, నిజమైన అంతర్మత సంభాషణ అనేది కేవలం మతశాస్త్ర చర్చలకే పరిమితం కాదు. పేదరికం, పర్యావరణ విధ్వంసం, మానవతా సంక్షోభాలు, ఇతర సామాజిక సమస్యలను ఎదుర్కొనేందుకు వివిధ మతాల ప్రజలు కలిసికట్టుగా పనిచేసినప్పుడే అది సార్థకమవుతుంది. అవసరంలో ఉన్నవారి పట్ల సంఘీభావంతో కలిసి చేసే సేవే నిజమైన సంభాషణకు ప్రతిరూపమని ఆమె విశ్వసిస్తున్నారు.
సంఘ భవిష్యత్తుకు సినొడాలిటీ అత్యంత కీలకమని కూడా ఆమె అభిప్రాయపడ్డారు. 1995 నుంచి ఇండోనేషియాలో నిర్వహిస్తున్న సిదాంగ్ అగుంగ్ గెరెజా కతోలిక్ ఇండోనేషియా (SAGKI) జాతీయ స్థాయిలో పాస్టోరల్ విచక్షణ, ప్రణాళికకు ఒక ముఖ్య వేదికగా నిలిచింది. అయితే సినొడాలిటీ అనేది సమావేశాలకు మాత్రమే పరిమితం కాకుండా, విచారణలు, మేత్రాసనాల దైనందిన జీవితంలో ఆలకించడం, భాగస్వామ్యం, ఉమ్మడి బాధ్యత రూపంలో ప్రతిఫలించాలని ఆమె సూచించారు. పీఠకాపరులు, గురువులు, కన్యస్త్రీలు, లౌకిక విశ్వాసులు కలిసి నడిచే సంఘ జీవితం మరింత బలపడాలని ఆమె ఆకాంక్షించారు.
సంస్కృతీకరణ (Inculturation) విషయంలో కూడా ఇండోనేషియా సంఘం ఆదర్శప్రాయమైన అనుభవాన్ని కలిగి ఉంది. స్థానిక భాషలు, సాంప్రదాయ సంగీతం, జానపద కళలు, సాంస్కృతిక చిహ్నాలను సంఘ ఆరాధనలో, పాస్టోరల్ జీవితంలో సమన్వయం చేస్తూ, విశ్వసంఘ బోధనలకు నిబద్ధతను కాపాడుకుంటూనే సువార్త స్థానిక సంస్కృతిలో ఎలా వేళ్లూనుకోవచ్చో చూపిస్తోంది.
అదేవిధంగా విద్య, ఆరోగ్య సేవలు, సామాజిక సేవా రంగాల్లో సంఘం చేస్తున్న కృషి కూడా విశేషమైనది. కతోలిక పాఠశాలలు, ఆసుపత్రులు, సేవా సంస్థలు మత, జాతి భేదాలకు అతీతంగా ప్రజలకు సేవలందిస్తూ క్రైస్తవ సాక్ష్యాన్ని చాటడమే కాకుండా, వివిధ సమాజాల మధ్య విశ్వాసాన్ని బలోపేతం చేస్తున్నాయి.
అయితే సంఘం ముందున్న సవాళ్లను కూడా డా. పుస్పితాసారి గుర్తుచేశారు. గురువులు, కన్యస్త్రీల పిలుపులు తగ్గడం, పట్టణ ప్రాంతాలు–మారుమూల ప్రాంతాల మధ్య పాస్టోరల్ వనరుల అసమానత, ప్రార్థనా మందిరాల నిర్మాణానికి సంబంధించిన ఆచరణాత్మక ఇబ్బందులు వంటి అంశాలు సృజనాత్మకమైన పాస్టోరల్ దృక్పథాన్ని కోరుతున్నాయని ఆమె పేర్కొన్నారు.
డిజిటల్ యుగం కూడా సంఘానికి అవకాశాలతో పాటు సవాళ్లను తెచ్చిపెట్టిందని ఆమె అన్నారు. డిజిటల్ మాధ్యమాలు సువార్త ప్రకటనా అవకాశాలను విస్తరించినప్పటికీ, తప్పుడు సమాచారం, విభజనాత్మక ప్రచారం, సమాజంలో పెరుగుతున్న ధ్రువీకరణ వంటి సమస్యలను కూడా పెంచుతున్నాయి. సామాజిక ప్రసార మాధ్యమాల రంగంలో తన అనుభవాన్ని ప్రస్తావిస్తూ, డిజిటల్ అవగాహన, నైతిక సమాచార ప్రసారం, విశ్వసనీయమైన క్రైస్తవ సాక్ష్యం మరింత బలోపేతం కావాల్సిన అవసరాన్ని ఆమె నొక్కిచెప్పారు. సాంకేతికత విభజనకు కారణం కాకుండా, సంభాషణకు వంతెనగా మారాలని ఆమె ఆకాంక్షించారు.
ఆసియా దేశాల పీఠాధిపతులు జకార్తాలో సమావేశమవుతున్న ఈ సందర్భంగా, ఇండోనేషియా కతోలిక సంఘం తన అనుభవాన్ని సినొడాలిటీ, సువార్త ప్రకటనా ధ్యేయంపై జరుగుతున్న చర్చలకు ఒక విలువైన తోడ్పాటుగా అందించాలని ఆశిస్తోంది. ఆతిథ్యం ఇవ్వడమే కాకుండా, సంభాషణ, సేవ, సంస్కృతిపట్ల గౌరవం, భిన్న మతాల ప్రజలతో సహకారం ద్వారా వంతెనలు నిర్మించిన జీవన అనుభవాన్ని ఆసియా సంఘంతో పంచుకోవాలనే సంకల్పంతో ఉంది.
డా. మరియా పుస్పితాసారి దృష్టిలో, ఈ FABC ప్లీనరీ మహాసభ ఆసియా సంఘం ఒకే దేవుని ప్రజలుగా కలిసి నడిచే తన పిలుపును పునరుద్ధరించుకోవడానికి, అలాగే బహుళత్వం, పరస్పర అనుసంధానం పెరుగుతున్న ప్రపంచంలో సృజనాత్మకంగా సువార్త ప్రకటించే మార్గాలను అన్వేషించడానికి ఒక చారిత్రక అవకాశంగా నిలవనుంది. సంఘ జీవితం, విద్యా రంగంలోని అనుభవం, సమాజ శ్రేయస్సుపట్ల ఆమెకున్న నిబద్ధత—లౌకిక నాయకత్వం కూడా ఆసియా సంఘం వేదాంత, పాస్టోరల్ చింతనను ఎంతగానో సమృద్ధి పరచగలదనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి.