మతాల మధ్య సంభాషణకు జీవితాన్ని అంకితం చేసిన భారతీయ గురువు
సంభాషణ ద్వారా విశ్వాసాల మధ్య వంతెనలు నిర్మిస్తున్న గురుశ్రీ ఎం.డి. థామస్
జులై 20 నుండి 26 వరకు ఇండోనేషియాలోని జకార్తాలో "సినోడల్ పరివర్తన – ఆసియాలో వంతెనలుగా, వంతెనలు నిర్మించేవారిగా సంఘం యొక్క ప్రేషిత కార్యం" అనే అంశంతో జరగనున్న ఫెడరేషన్ ఆఫ్ ఏషియన్ బిషప్స్ కాన్ఫరెన్సెస్ (FABC) ప్లీనరీ అసెంబ్లీ నేపథ్యంలో, భారతీయ గురువు గురుశ్రీ ఎం.డి. థామస్ జీవితం, సేవ, ఈ దృక్పథానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది.
గత నాలుగు దశాబ్దాలకు పైగా గురుశ్రీ థామస్ వివిధ మతాలకు చెందిన ప్రజల మధ్య సంభాషణ, విద్య, పరస్పర పరిచయం ద్వారా విశ్వాస వంతెనలను నిర్మించేందుకు తన జీవితాన్ని అంకితం చేశారు. అనేక మత సంప్రదాయాలు సహజీవనం చేస్తున్న ఆసియా ఖండంలో శాశ్వత శాంతి అనేది విభజన ద్వారా కాదు; పరస్పర అవగాహన, గౌరవం, స్నేహబంధాల ద్వారానే సాధ్యమవుతుందనే విశ్వాసాన్ని ఆయన తన పరిచర్య ద్వారా ఆచరణలో చూపించారు.
గురుశ్రీ థామస్ తన సేవా జీవితంలో అనేక విశిష్ట గుర్తింపులు పొందారు. మిషనరీస్ ఆఫ్ సెయింట్ థామస్ (MST) సంఘానికి చెందిన తొలి సభ్యుల్లో ఒకరైన ఆయన, వారణాసిలోని ప్రతిష్ఠాత్మక బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి హిందీలో డాక్టరేట్ పొందిన తొలి క్రైస్తవ యాజకుడిగా చరిత్ర సృష్టించారు. అలాగే కాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా (CBCI) మతసామరస్య కమిషన్ తొలి జాతీయ కార్యదర్శిగా తొమ్మిది సంవత్సరాల పాటు సేవలందించారు.
2014 నుండి 73 ఏళ్ల గురుశ్రీ థామస్, న్యూఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్మనీ అండ్ పీస్ స్టడీస్ (IHPS) వ్యవస్థాపక-డైరెక్టర్గా సేవలందిస్తున్నారు.
తన సుదీర్ఘ సేవా కాలంలో హిందూ, ఇస్లాం, క్రైస్తవం, సిక్కు, బౌద్ధం, జైనం, బహాయి, యూద మతం, అహ్మదీయా సమాజం తదితర మత సంప్రదాయాలకు చెందిన ప్రజల మధ్య సంభాషణను, పరస్పర గౌరవాన్ని పెంపొందించేందుకు నిరంతరం కృషి చేశారు.
"మతం పేరుతో ద్వేషం, హింస, హత్యలు జరుగుతున్న ఈ కాలంలో వివిధ మతాల మధ్య సంభాషణ అత్యవసరంగా అవసరమైంది," అని గురుశ్రీ థామస్ పేర్కొన్నారు.
"దశాబ్దాలుగా నేను కొనసాగిస్తున్న సామరస్యం, శాంతి మిషన్ నాకు ఆనందాన్ని, ఈ సేవకు మూలమైన దేవునితో మరింత ఐక్యతను ప్రసాదిస్తోంది. పవిత్ర తండ్రి పోప్ ఫ్రాన్సిస్ తన 'ఫ్రాటెల్లి టుట్టి' ఎన్సైక్లికల్లో కూడా ఇదే దృక్పథాన్ని బలంగా నొక్కిచెప్పారు," అని ఆయన అన్నారు.
గురుశ్రీ థామస్ సేవ, మతాంతర సంభాషణకు విశేష ప్రాధాన్యత ఇచ్చిన పోప్ ఫ్రాన్సిస్ దృక్పథానికి దగ్గరగా ఉంటుంది. 2019లో అబుదాబిలో అల్-అజ్హర్ గ్రాండ్ ఇమామ్ షేక్ అహ్మద్ అల్-తయ్యెబ్తో కలిసి ప్రపంచ శాంతి, సహజీవనం కోసం 'మానవ సోదరభావ పత్రం' (Document on Human Fraternity)పై పోప్ ఫ్రాన్సిస్ సంతకం చేయడం ఈ దృక్పథానికి ప్రపంచవ్యాప్త గుర్తింపును తీసుకువచ్చింది.
తన సేవకు ప్రేరణ కుటుంబం నుంచే లభించిందని గురుశ్రీ థామస్ తెలిపారు.
"క్రైస్తవ సమాజం విస్తృత మేలు కోసం పనిచేయాలనే కోరిక చిన్నప్పటి నుంచే నాలో పెరిగింది. దానికి మా కుటుంబ పెంపకమే కారణం" అని ఆయన చెప్పారు.
పాఠశాల విద్య పూర్తయిన అనంతరం 1969లో ఆయన సెమినరీలో ప్రవేశించారు. ఆధ్యాత్మిక శిక్షణ పొందుతున్న కాలంలోనే మతసామరస్యంపై ఆయనకు ప్రత్యేకమైన ఆసక్తి ఏర్పడింది.
తరువాత మధ్య భారతదేశంలో గురువుగా సేవలందిస్తున్న సమయంలో వివిధ మతాలు, భావజాలాలకు చెందిన ప్రజలతో సన్నిహితంగా మెలిగారు. హిందీ భాషపై పరిమిత పరిజ్ఞానం తన పరిచర్యకు అడ్డంకిగా మారుతోందని గుర్తించిన ఆయన, హిందీ సాహిత్యంలో ఉన్నత విద్యను అభ్యసించాలని నిర్ణయించుకున్నారు.
"మిషన్ అవసరాలను గుర్తించి, ఇతర అవకాశాలను పక్కనపెట్టి హిందీ సాహిత్యంలో ప్రత్యేకత సాధించాలని నిర్ణయించుకున్నాను,"అని ఆయన గుర్తుచేసుకున్నారు.
హిందీపై పట్టు సాధించిన తరువాత స్థానిక ప్రజలతో మరింత సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకున్నారు. ఈ కాలంలో బహుమత భక్తి సంగీత కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు, గ్రామీణ అక్షరాస్యత కార్యక్రమాన్ని ప్రారంభించి, పాఠశాల విద్యార్థుల ద్వారా గ్రామీణ చిన్నారులకు చదవడం, రాయడం నేర్పించే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు.
తరువాత బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పూర్తి చేసి, ఆ విశ్వవిద్యాలయం నుంచి హిందీలో P.Hd పొందిన తొలి క్రైస్తవ యాజకుడిగా నిలిచారు.
'కబీర్ అండ్ క్రిస్టియన్ ఫిలాసఫీ' (కబీర్ మరియు క్రైస్తవ తత్వశాస్త్రం) నా పరిశోధన అంశం," అని గురుశ్రీ థామస్ తెలిపారు.
15వ శతాబ్దపు కవి-సంత్ కబీర్ బోధనలను క్రైస్తవ తత్వశాస్త్రంతో పోల్చుతూ, వివిధ మత సంప్రదాయాల్లోని ఉమ్మడి ఆధ్యాత్మిక విలువలను తన పరిశోధనలో విశ్లేషించారు.
1994లో డాక్టరేట్ పూర్తి చేసిన అనంతరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిలిజన్ అండ్ కల్చర్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టి, మతాంతర సంభాషణ, అంతర్-సాంస్కృతిక విద్య, బహుభాషా అభ్యాసం, బహుశాఖా పరిశోధనలను ప్రోత్సహించారు.
తరువాత ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయంలో ఉర్దూ భాషను అభ్యసించడం ద్వారా ముస్లిం సమాజంతో మరింత సన్నిహితంగా సంభాషించే అవకాశం ఆయనకు లభించింది.
CBCI మతసామరస్య కమిషన్ జాతీయ కార్యదర్శిగా నియమితులైన తరువాత భారతదేశంలోని విభిన్న మత సమాజాల మధ్య శాంతి, సామరస్యాన్ని ప్రోత్సహించేందుకు మరింత విస్తృత వేదిక ఆయనకు లభించింది.
ఆయన డాక్టరేట్ పరిశోధన "కబీర్ ఔర్ ఈసాయీ చింతన్" పేరుతో హిందీలో పుస్తకరూపంలో వెలువడి, హిందీ అకాడమీ ప్రదానం చేసే "సాహిత్యిక్ కృతి సమ్మాన్" పురస్కారాన్ని అందుకుంది.
పరిచర్యతో పాటు గురుశ్రీ థామస్ భారతదేశంతో పాటు విదేశాల్లోని విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో అధ్యాపకునిగా సేవలందించారు. జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, మతాంతర సమావేశాలు, సామాజిక వేదికలలో ప్రసంగించారు. పరిశోధక విద్యార్థులకు మార్గదర్శకత్వం వహించడంతో పాటు పలు విద్యాసంస్థల్లో విజిటింగ్ ప్రొఫెసర్గా కూడా సేవలందించారు.
మతాంతర సంభాషణ, మతసామరస్యం, శాంతి నిర్మాణం వంటి అంశాలపై ఆయన ఏడు ఆంగ్ల, ఐదు హిందీ భాషల్లో మొత్తం 12 గ్రంథాలు రచించారు. ఆయన వ్యాసాలు అనేక పత్రికల్లో ప్రచురితమయ్యాయి. అదేవిధంగా రెండు సంగీత ఆల్బమ్లను కూడా విడుదల చేశారు.
జకార్తాలో సమావేశమవుతున్న FABC ఆసియా సంఘం మరింత సమర్థవంతమైన "వారధులని నిర్మించే సంఘంగా" ఎలా రూపాంతరం చెందాలనే అంశంపై మథనం చేస్తున్న ఈ తరుణంలో, గురుశ్రీ ఎం.డి. థామస్ జీవితం ఆ పిలుపుకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది.
పాండిత్యం, మతాంతర సంభాషణ, దశాబ్దాలపాటు వివిధ విశ్వాసాల ప్రజలతో సహనంతో కొనసాగించిన అనుబంధం ద్వారా, వంతెనలు ఒక్క రోజులో నిర్మించబడవని; ప్రతి మానవ సంబంధం ద్వారా ఒక్కో వంతెన నిర్మితమవుతుందని, అపనమ్మకాల స్థానంలో పరస్పర అవగాహనను, విభేదాల స్థానంలో శాంతిని వికసింపజేయవచ్చని ఆయన తన జీవితంతో నిరూపించారు.