సౌకర్యం కన్నా నిబద్ధతకే ప్రాధాన్యత - భారతీయ కతోలిక వైద్యురాలు
సౌకర్యం కన్నా నిబద్ధతకే ప్రాధాన్యత - భారతీయ కతోలిక వైద్యురాలు
కేరళలోని ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య అధికారిగా నియమితులైన మొట్టమొదటి కతోలిక సన్యాసిని సిస్టర్ జీన్ రోజ్. వైద్య డిగ్రీలు ఉన్న కతోలిక సన్యాసినులు(సిస్టర్స్) సాధారణంగా కతోలిక యాజమాన్యంలోని ఆసుపత్రులు లేదా ఆరోగ్య సంరక్షణ సంస్థలలో మాత్రమే పనిచేస్తారు. అయితే సిస్టర్ జీన్ రోజ్ నేరుగా సామాన్యులకు అందుబాటులో ఉండాలని ఆమె ప్రభుత్వ సర్వీసును ఎంచుకున్నారు.
జీన్ రోజ్ కట్టప్పన వంటి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యురాలిగా పనిచేయాలని ఎంచుకోవడం అసాధారణమైన విషయం. ఎందుకంటె వైద్యులు వెళ్లడానికి భయపడే చోట సిస్టర్ జీన్ రోజ్ డాక్టర్ గా సేవ చేయాలనీ నిర్ణయించుకున్నారు. ఇతర వైద్యులు అక్కడి కష్టాలు భరించలేక బదిలీ చేయించుకుని వెళ్లిపోతుంటే, సిస్టర్ రోజ్ మాత్రం అక్కడే ఉంటూ వేలాది మంది గిరిజనుల ప్రాణాలు కాపాడుతున్నారు. అంతకుముందు ఆమె కేరళలోని మరయూర్లో ఉన్న ఫ్యామిలీ హెల్త్ సెంటర్ అనే కతోలిక ఆసుపత్రిలో పదేళ్లపాటు పనిచేశారు.
సిస్టర్ రోజ్ దట్టమైన అడవుల గుండా స్కూటర్ పై వెళ్తూ, ఏనుగులు, పులులు వంటి వన్యప్రాణుల భయం ఉన్నప్పటికీ గిరిజన గ్రామాలకు వెళ్లి వైద్య సేవలను అందిస్తున్నారు.
ఈ సామాజిక ఆరోగ్య కేంద్రం చుట్టూ, దట్టమైన అడవుల్లో నివసించే సుమారు 25 గిరిజన సముదాయాలు ఉన్నాయి. సగటున, మేము ప్రతిరోజూ 200కు పైగా బాహ్య రోగుల (outpatients) కేసులను పరిశీలిస్తాము. అలాగే, తమ ఇళ్లలోనే మంచాన పడి ఉన్నవారికి కూడా మేము వైద్య సేవలు అందిస్తాము. ఈ కేంద్రంలో అంతర్గత రోగుల (inpatient) సదుపాయాలు లేనందున, నేను వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఆ దట్టమైన అడవుల్లోని వారి ఇళ్లకు స్వయంగా వెళ్తుంటాను అని డాక్టర్ సిస్టర్ జీన్ రోజ్ గారు తెలిపారు.
'సిస్టర్స్ ఆఫ్ ది డెస్టిట్యూట్' సభ్యురాలైన సిస్టర్ జీన్ రోజ్ గారు కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో సెయింట్ జాన్స్ మెడికల్ కాలేజీ నుండి MBBS (బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్, బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ) మరియు అనస్థీషియాలో మాస్టర్స్ పూర్తి చేశారు.
కతోలిక సంస్థలచే నడపబడే ఆసుపత్రులు లో వైద్యులుగా పనిచేస్తున్న కతోలిక సన్యాసినులు వందలాది మంది ఉన్నారు. అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో సేవ చేయడం చాలా అరుదు.
భారతదేశంలో ఇలాంటి సేవలు అందించిన మరొక ప్రముఖురాలు సిస్టర్ మేరీ గ్లోరీ. ఈమె ప్రపంచంలోనే వైద్యవృత్తిని చేపట్టడానికి అనుమతి పొందిన మొదటి సన్యాసిని మరియు 'క్యాథలిక్ హెల్త్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా' (CHAI) స్థాపకురాలు. ఈమె గుంటూరులో, 37 సంవత్సరాల పాటు పేదలు మరియు మహిళలకు వైద్య సేవలు అందించారు.
Article and Design by M kranthi Swaroop