కార్డినల్ గ్రాసియాస్: సినడాలిటీ ప్రపంచానికి శ్రీసభ వరం

కార్డినల్ గ్రాసియాస్
జూలై 21న జరిగిన FABC 12వ ప్లీనరీ సమావేశ ప్రారంభ దివ్యబలికి పరిశుద్ధ లియో పాపు గారి ప్రత్యేక ప్రతినిధి కార్డినల్ ఓస్వాల్డ్ గ్రాసియాస్ అధ్యక్షత వహిస్తూ, సంభాషణ, సయోధ్య, సోదరభావం ద్వారా ఆసియాలోని స్థానిక శ్రీసభలు శాంతి నిర్మాణకర్తలుగా మారాలని పిలుపునిచ్చారు.

పరిశుద్ధ లియో పాపు గారి ప్రత్యేక ప్రతినిధి కార్డినల్ ఓస్వాల్డ్ గ్రాసియాస్, జూలై 21న Federation of Asian Bishops' Conferences (FABC) 12వ ప్లీనరీ సమావేశాన్ని ప్రారంభిస్తూ, "సినడాలిటీ అనేది ప్రపంచానికి శ్రీసభ అందించే అత్యంత గొప్ప వరాల్లో ఒకటి" అని పేర్కొన్నారు. అలాగే సంభాషణ, సయోధ్య, సోదరభావం ద్వారా ఆసియాలోని స్థానిక శ్రీసభలు శాంతి నిర్మాణకర్తలుగా మారాలని పిలుపునిచ్చారు.

జకార్తాలోని హోటల్ ములియా బాల్‌రూమ్స్ 2, 3లో ఉదయం 9 గంటలకు జరిగిన ప్రారంభ దివ్యబలిపూజకు అధ్యక్షత వహించిన కార్డినల్ గ్రాసియాస్, శ్రీసభ సేవ ప్రజలను ఏకం చేయడం, సయోధ్యను పెంపొందించడం, శాంతికి సాధనంగా నిలవడమేనని తెలిపారు.

"మన సేవ వారధుల నిర్మాణకర్తలుగా మారడమే. వారధులను నిర్మించడానికి శ్రీసభ పిలువబడింది," అని తన ప్రసంగంలో పేర్కొన్నారు.

ప్రారంభ దివ్యబలిపూజ, ఇండోనేషియా వివిధ ప్రాంతాల సాంస్కృతిక సంప్రదాయాలను, అలాగే ఆసియా శ్రీసభకు ప్రాతినిధ్యం వహించే ప్రార్థనలను సమన్వయం చేస్తూ వైవిధ్యభరితమైన రూపాన్ని సంతరించుకుంది.

కార్డినల్ గ్రాసియాస్‌తో పాటు హాంకాంగ్‌కు చెందిన కార్డినల్ స్టీఫెన్ చౌ సౌ-యాన్, తిమోర్-లెస్టేకు చెందిన కార్డినల్ వర్జిలియో దో కార్మో ద సిల్వా సహఅర్చకులుగా పాల్గొన్నారు. వీరితో పాటు ఆసియా నలుమూలల నుంచి వచ్చిన వందకు పైగా కార్డినల్స్, పీఠాధిపతులు, గురువులు, కన్యస్త్రీలు, ప్రతినిధులు ఈ వారాంత సమావేశంలో పాల్గొన్నారు.

ప్రవేశ ఊరేగింపు ప్రారంభమైనప్పుడు, ఇండోనేషియాలోని ఉత్తర సుమత్రా ప్రాంతానికి చెందిన నియాస్, బటాక్, మినాంగ్కబౌ జాతుల సాంప్రదాయ వస్త్రధారణలో ఉన్న పురుషులు, మహిళలు పీఠాధిపతులను, ప్రతినిధులను సమావేశ మందిరంలోకి ఆహ్వానించారు. ఈ సాంస్కృతిక స్వాగతం ఇండోనేషియా జాతి వైవిధ్యాన్ని ప్రతిబింబించడమే కాకుండా, ఆతిథ్య శ్రీసభ సాదర స్వాగతాన్ని కూడా వ్యక్తపరిచింది.

విశ్వాసుల ప్రార్థనలు కూడా ఆసియా వైవిధ్యాన్ని ప్రతిబింబించాయి. జావనీస్, మెంటావై, మాండరిన్ చైనీస్, బోర్నియోకు చెందిన బెనావాస్ దయాక్, తూర్పు నుసా తెంగ్గారాకు చెందిన సుంబానీస్ భాషల్లో ప్రార్థనలు సమర్పించబడ్డాయి. ఈ బహుభాషా ప్రార్థనలు ఆసియాలోని అనేక ప్రజలు, సంస్కృతులు, భాషల మధ్య శ్రీసభ ఐక్యతను ప్రతిబింబించాయి.
 

ఈ దివ్యబలి మరో ప్రత్యేకత పరిశుద్ధుల ప్రార్థన (Litany of the Saints). ఇందులో చైనా, భారతదేశం, జపాన్, కొరియా, మలేషియా, ఫిలిప్పీన్స్, శ్రీలంక, హాంకాంగ్, థాయ్‌లాండ్, మయన్మార్, కజకిస్థాన్, ఇండోనేషియా, లావోస్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలకు చెందిన పునీతుల మధ్యవర్తిత్వాన్ని కోరుతూ ప్రార్థించారు. ఇది ఆసియా క్రైస్తవ వారసత్వ సంపదను ప్రత్యేకంగా చాటిచెప్పింది.

తన ప్రసంగంలో కార్డినల్ గ్రాసియాస్, FABC సమావేశం కేవలం పరిపాలనా సమావేశం మాత్రమే కాదని పేర్కొన్నారు. ఆసియాలోని స్థానిక శ్రీసభలు కాలపు సంకేతాలను వివేచించి, సువార్త ప్రకటనా సేవ పట్ల తమ నిబద్ధతను పునరుద్ధరించుకునే అవకాశమిదని అన్నారు.

FABC ఐదు దశాబ్దాలకు పైబడిన ప్రయాణాన్ని స్మరించుకుంటూ, ఇటీవలి కాలంలో శ్రీసభ ఎదుర్కొన్న అతిపెద్ద సవాళ్లలో కోవిడ్-19 మహమ్మారి ఒకటని గుర్తుచేశారు. ఈ సంక్షోభం ఆసియా అంతటా బాధలను కలిగించినప్పటికీ, స్థానిక శ్రీసభల స్థైర్యం, సంఘీభావం, సహోదర భావాన్ని కూడా వెలుగులోకి తెచ్చిందని అన్నారు.

యుద్ధాలు, హింస కూడా నేటి మానవాళి ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో ఒకటని పేర్కొంటూ, ప్రపంచ పరిస్థితిని "దశల వారీగా జరుగుతున్న మూడవ ప్రపంచ యుద్ధం"గా అభివర్ణించిన పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి మాటలను ఆయన స్మరించారు.

సినడాలిటీ శ్రీసభకే కాకుండా సమాజానికీ ఒక గొప్ప వరమని కార్డినల్ గ్రాసియాస్ వివరించారు. కుటుంబ జీవితం, సమాజ జీవనం, పరస్పర గౌరవం వంటి విలువల ద్వారా కలిసి నడిచే సంస్కృతి ఆసియా దేశాల్లో చాలా కాలంగా ఉందని పేర్కొన్నారు. వినడం, భాగస్వామ్యం, ఉమ్మడి బాధ్యత వంటి సినడల్ విలువలు మంచి పరిపాలనకు దోహదపడటమే కాకుండా, ఆసియాలోని అనేక ప్రాంతాల్లో అవినీతిని ఎదుర్కోవడంలో కూడా సహాయపడతాయని అన్నారు.

దివ్యబలిపూజ ముగింపులో కార్డినల్ గ్రాసియాస్, ఆసియా అంతటా శాంతి, సోదరభావాన్ని నిర్మించేందుకు కొత్త, సృజనాత్మక మార్గాలను అన్వేషించాలని ప్రతినిధులను ప్రోత్సహించారు.

"దేవుడు FABCని ఆశీర్వదించుగాక. దేవుడు ఆసియాను ఆశీర్వదించుగాక," అని ఆయన ఆకాంక్షించారు.