గాజా ప్రజల సహాయార్థం పోప్ లియో పిలుపునిచ్చారు

గాజా ప్రజల సహాయార్థం పోప్ లియో పిలుపునిచ్చారు

మే 26వ తేదీ సాయంత్రం కాస్టెల్ గాండోల్ఫోలోని తన నివాసం వెలుపల విలేకరులతో మాట్లాడుతూ పరిశుద్ధ లియో XIV పాపు గారు గాజా ప్రజలకు సహాయం చేయాలని అంతర్జాతీయ సమాజానికి మరోసారి పిలుపునిచ్చారు. గాజా ప్రజలకు సహాయం చేయాలని, మానవ హక్కులను పరిరక్షించాలని కోరారు.

ఇజ్రాయెల్ బలగాలు అంతర్జాతీయ జలాల్లో 'గ్లోబల్ సుముద్ ఫ్లోటిల్లా' (Global Sumud Flotilla) సహాయక నౌకలను అడ్డగించి అందులోని దాదాపు 430 మంది అంతర్జాతీయ కార్యకర్తలను, మానవ హక్కుల రక్షకులను నిర్బంధించాయి. వీరి గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా, "ప్రతి వ్యక్తి యొక్క మానవ హక్కులను గౌరవించాలన్న మా విజ్ఞప్తిని మనం పునరుద్ధరించాలి" అని పరిశుద్ధ లియో XIV పాపు గారు అన్నారు.

టర్కీలోని మార్మరిస్ నుంచి బయలుదేరిన ఈ నౌకలు మొత్తం 54 వున్నాయి .దాదాపు 400 మందికి పైగా వైద్యులు, పాత్రికేయులు, మరియు వివిధ దేశాలకు చెందిన పౌరులు ఉన్నారు. మందులు, శ్వాసకోశ పరికరాలు, మరియు పోషకాహారంతో సహా సుమారు లక్ష డాలర్ల విలువైన అత్యవసర సహాయాన్ని వీరు గాజాకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.

విలేకరులతో మాట్లాడుతూ, గాజాలోని పౌరులు అనుభవిస్తున్న నిరంతర బాధల పట్ల పరిశుద్ధ లియో XIV పాపు గారు విచారం వ్యక్తం చేశారు. "దురదృష్టవశాత్తు, గాజా ప్రజలకు ఇప్పటికీ మానవతా సహాయం అందడం లేదు" అని ఆయన పేర్కొన్నారు.

Article and Design By M. Kranthi Swaroop