ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై CBCI సంతాపం తెలిపింది

ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై CBCI సంతాపం తెలిపింది
అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభ్ భాయ్ విమానాశ్రయం సమీపంలో జూన్ 12, 2025 మధ్యాహ్నం జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం నేపథ్యంలో కతోలిక బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా (CBCI) తీవ్ర విచారం మరియు సంఘీభావాన్ని వ్యక్తం చేసింది.
CBCI ఫాదర్ రాబిన్సన్ రోడ్రిగ్స్ విడుదల చేసిన ఒక ప్రకటనలో, ఈ వినాశకరమైన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారందరి కుటుంబాలకు కతోలిక బిషప్లు తమ హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేశారు.
"ఈ విషాద సమయంలో మా ప్రార్థనలు వారితో ఉన్నాయి అని, ప్రమాదంలో గాయపడిన వారందరూ త్వరగా మరియు పూర్తిగా కోలుకోవాలని మేము హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాము" అని ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ సందర్భముగా దేశవ్యాప్తంగా ప్రార్థన కోసం పిలుపునిస్తూ, బాధితులకు ఆధ్యాత్మిక మద్దతు ఇవ్వడంలో కతోలిక విశ్వాసులు మరియు సద్భావన ఉన్న వారందరూ చేరాలని, వారి కొరకు ప్రత్యేక పార్థనలు చేయాలనీ CBCI కోరింది.
ముఖ్యంగా "మరణించిన వారికి శాశ్వత విశ్రాంతి కోసం, దుఃఖంలో ఉన్నవారికి ఓదార్పు కోసం మరియు గాయపడిన వారికి బలం మరియు స్వస్థత కోసం అందరు ప్రార్ధించాలి అని మరియు ఓదార్పుకు మూలమైన దేవుడు, ఈ భయంకరమైన విపత్తుతో ప్రభావితమైన వారందరినీ ఆదుకుంటాడు అని తెలిపారు.
గురువారం (జూన్ 12) మధ్యాహ్నం గుజరాత్లోని అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం(AI- 171) కుప్ప కూలిపోయింది. మధ్యాహ్నం 1:10 గంటలకు అహ్మదాబాద్ నుంచి టేకాఫ్ తీసుకున్న వెంటనే కూలిపోయింది. మేఘనీనగర్ అనే ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. మెడికల్ కాలేజీ హాస్టల్ భవనాలను ఢీకొని విమానం క్రాష్ అయినట్టు ప్రాథమికంగా అధికారులు చెబుతున్నారు.
ఈ విమాన ప్రమాదంలో 241 మంది మరియు సిబ్బంది మరణించినట్టు ఎయిర్ ఇండియా ప్రకటించింది.మెడికల్ కాలేజీ హాస్టల్లోని 20 మందికిపైగా వైద్య విద్యార్థులు దుర్మరణం చెందారు. విమాన ప్రమాదం నుంచి ఒకరు బయటపడ్డారు. గాయాలతో హాస్పిటల్లో చేరినవారంతా మెడికల్ కాలేజీకి సంబంధించిన విద్యార్ధులు, సిబ్బంది. ఈ ఘటనలో చనిపోయినవారిని డీఎన్ఏ పరీక్షల ద్వారా గుర్తించనున్నారు.
Article and Design: M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer