సినడాలిటీ సువార్త ప్రచారానికి మార్గం కావలి: FABC ఉపాధ్యక్షుడు కార్డినల్ డేవిడ్

 FABC ఉపాధ్యక్షుడు కార్డినల్ డేవిడ్
FABC ప్లీనరీ సమావేశం ముగింపు విలేకరుల సమావేశంలో కార్డినల్ పాబ్లో వర్జిలియో డేవిడ్ మాట్లాడుతూ, శ్రీసభ సేవ అనేది కేవలం మతాన్ని ప్రచారం చేయడం మాత్రమే కాదని, సమస్త మానవాళిని ఏకతాటిపై నిలిపే ఉమ్మడి మానవత్వాన్ని, మానవ గౌరవాన్ని పరిరక్షించడమేనని పేర్కొన్నారు.

Federation of Asian Bishops' Conferences (FABC) ఉపాధ్యక్షుడు కార్డినల్ పాబ్లో వర్జిలియో డేవిడ్ మాట్లాడుతూ, సినడల్ పరివర్తన శ్రీసభను సువార్త ప్రచార సేవ వైపు నడిపించినప్పుడే దానికి నిజమైన అర్థం ఉంటుందని పేర్కొన్నారు. జకార్తాలో జరిగిన FABC 12వ ప్లీనరీ సమావేశం ముగింపు సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

జూలై 26న మరియమాత స్వర్గారోహణ బృహద్దేవాలయ సేవా కేంద్రంలో నిర్వహించిన ప్లీనరీ సమావేశ తుది విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ సమావేశం కేవలం చర్చలకే పరిమితం కాకుండా, ఆసియా అంతటా స్థానిక శ్రీసభలు "వారధులు, వారధుల నిర్మాణకర్తలుగా" మారేందుకు ప్రేరణనిచ్చిన సమావేశంగా గుర్తుండిపోవాలని అన్నారు.

ఈ విలేకరుల సమావేశానికి ముందు ప్రతినిధులు జకార్తాలోని ఫ్రెండ్షిప్ టన్నెల్ గుండా సమీపంలోని ప్రపంచంలోని అతిపెద్ద మసీదులలో ఒకటైన ఇస్తిక్లాల్ మసీదు వరకు ప్రతీకాత్మక పాదయాత్ర చేసారు. ఈ సమావేశంలో FABC అసోసియేట్ ప్రధాన కార్యదర్శి, Office of Synodality కార్యనిర్వాహక కార్యదర్శి గురుశ్రీ క్లారెన్స్ దేవదాస్, ఇండోనేషియా కతోలిక పీఠాధిపతుల సమాఖ్య అధ్యక్షుడు పీఠాధిపతి ఆంటోనియస్ సుబియాంటో బుంజామిన్ కూడా పాల్గొన్నారు.

పీఠాధిపతులు తమ తమ మేత్రాసనాలకు తీసుకెళ్లగల అత్యంత ఆచరణాత్మక ఫలితం ఏమిటనే ప్రశ్నకు సమాధానంగా కార్డినల్ డేవిడ్, "మీరు అంతకంటే గొప్ప సంగతులు చూస్తారు" అనే ప్లీనరీ సమావేశ ప్రధాన ఇతివృత్తాన్ని ప్రస్తావిస్తూ, అది వారం రోజులపాటు ప్రతినిధులకు మార్గదర్శకంగా నిలిచిందన్నారు.

పీఠాధిపతుల ధ్యాన, చింతనలు చివరకు విడదీయరాని రెండు పిలుపుల చుట్టూ కేంద్రీకృతమయ్యాయని ఆయన చెప్పారు. అవి సినడల్ పరివర్తన మరియు సువార్త ప్రచార సేవ.

"సినడాలిటీ అనేది కేవలం ఒక విధానం మాత్రమే కాదు. అది ఒక ఆధ్యాత్మికత. అది జీవనశైలి. అది శ్రీసభగా జీవించే విధానం," అని కార్డినల్ డేవిడ్ అన్నారు.

సినడాలిటీ అనేది కేవలం సేవాపర వ్యూహం లేదా పరిపాలనా ప్రక్రియ మాత్రమే కాదని, శ్రీసభ స్వరూపాన్ని, పరస్పర సంబంధాలను మలిచే జీవన విధానమని ఆయన వివరించారు.

అందువల్ల, ప్లీనరీ సమావేశంలో ప్రతిపాదించిన పరివర్తన వ్యక్తిగత విశ్వాసానికే పరిమితం కాకుండా, పరస్పర సంబంధాలు, సేవాపర విధానాలు, శ్రీసభ నిర్మాణాల పునరుద్ధరణను కూడా కలిగి ఉందని ఆయన చెప్పారు.

అయితే, ఆ పునరుద్ధరణ అంతర్ముఖంగానే నిలిచిపోకూడదని ఆయన స్పష్టం చేశారు.

"అది సువార్త ప్రచార సేవకు దారి తీయాలి," అని కార్డినల్ డేవిడ్ అన్నారు.

ఆ సువార్త ప్రచార పిలుపు, "ఆసియాలో వారధులు, వారధుల నిర్మాణకర్తలుగా" మారాలనే ప్లీనరీ సమావేశ దృక్పథంలో స్పష్టంగా ప్రతిబింబించిందని ఆయన చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత సాంస్కృతిక, మత వైవిధ్యం కలిగిన ప్రాంతాలలో ఒకటైన ఆసియాలో స్థానిక శ్రీసభలు సంభాషణ, సమరసత, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించాలని ఆయన ప్రోత్సహించారు.

కార్డినల్ డేవిడ్ దృష్టిలో, ముగింపు దివ్యబలిపూజ అనంతరం ప్రతినిధులు జకార్తాలోని ఇస్తిక్లాల్ మసీదును సందర్శించడం, సువార్త ప్రచార సేవకు శక్తివంతమైన ఉదాహరణగా నిలిచింది.

మసీదు మరియు జకార్తా బృహద్దేవాలయంను అనుసంధానించే ఫ్రెండ్షిప్ టన్నెల్ గుండా నడవడం కేవలం ఒక ప్రతీకాత్మక చర్య మాత్రమే కాదని ఆయన అన్నారు. భిన్న మతాలకు చెందిన ప్రజలు పరస్పర గౌరవం, స్నేహభావంతో కలిసి నడవగలరని అది ఆచరణలో చూపించిందని పేర్కొన్నారు.

ఇస్తిక్లాల్ మసీదు ప్రధాన ఇమామ్‌ను కలుసుకోవడం, మతాంతర సామరస్యానికి ఇండోనేషియా చూపుతున్న నిబద్ధతను ప్రత్యక్షంగా చూడడం ప్లీనరీ సమావేశంలోని అత్యంత చిరస్మరణీయ అనుభవాలలో ఒకటిగా నిలిచిందని కార్డినల్ చెప్పారు.

"ఆ అనుభవాన్ని మేము మాతో పాటు స్వదేశాలకు తీసుకెళ్తాం," అని ఆయన అన్నారు.

ఆ భేటీ, క్రైస్తవులు, ముస్లింలు అన్నింటికంటే ముందుగా ఒకే మానవ కుటుంబానికి చెందిన సోదర సోదరీమణులనే తమ విశ్వాసాన్ని మరింత బలపరిచిందని కార్డినల్ డేవిడ్ పేర్కొన్నారు.

"శ్రీసభ సేవ అనేది కేవలం మన మతాన్ని ప్రచారం చేయడం మాత్రమే కాదు. మన ఉమ్మడి మానవత్వాన్ని, ఉమ్మడి మానవ గౌరవాన్ని ప్రోత్సహించినప్పుడే మనం నిజంగా ఒకరినొకరు కలుసుకోగలం," అని ఆయన అన్నారు.

ఇలాంటి సాక్షాత్కారాలు, విభజనను అధిగమిస్తూ సంభాషణ, పరస్పర గౌరవం, సహకారంతో 'ప్రేమ నాగరికత' ను నిర్మించాలనే శ్రీసభ విశాలమైన సేవను ప్రతిబింబిస్తాయని ఆయన చెప్పారు.

ఆసియా అంతటా తమ స్థానిక శ్రీసభలకు తిరిగి వెళ్తున్న పీఠాధిపతులకు ఇప్పుడు ఉన్న సవాలు ఏమిటంటే, ప్లీనరీ సమావేశ స్ఫూర్తిని ఆచరణాత్మక సేవాపర కార్యక్రమాలుగా మలచడం, తద్వారా సినడల్ పరివర్తన శ్రీసభలోనూ, ఆసియాలోని అనేక సంస్కృతులు, మతాల మధ్యనూ వారధులు నిర్మించే సువార్త ప్రచార జీవన విధానంగా రూపాంతరం చెందేలా చేయడమేనని కార్డినల్ డేవిడ్ అన్నారు.

Telugu Survey Popup Image