సినడల్ స్ఫూర్తితో కూడిన గురువులను తీర్చిదిద్దడానికే ప్రాధాన్యం: FABC గురువుల కార్యాలయం

మహా పూజ్య ఉడుమల బాల
జూలై 21న జరిగిన FABC 12వ ప్లీనరీ సమావేశంలో తన నివేదికను సమర్పించిన FABC గురువుల కార్యాలయం, ఆసియాలో మరింత సినడల్, సువార్త ప్రచార స్ఫూర్తి కలిగిన శ్రీసభకు సేవలందించే గురువుల రూపకల్పన పట్ల తన నిబద్ధతను పునరుద్ఘాటించింది.

Federation of Asian Bishops' Conferences (FABC) 12వ ప్లీనరీ సమావేశంలో, ఆసియాలో మరింత సినడల్, సువార్త ప్రచార స్ఫూర్తి కలిగిన శ్రీసభకు నాయకత్వం వహించే గురువులను తీర్చిదిద్దేందుకు తమ నిబద్ధతను FABC గురువుల కార్యాలయం మరోసారి పునరుద్ఘాటించింది. గత రెండు దశాబ్దాలుగా నిర్వహించిన గురువుల రూపకల్పన కార్యక్రమాలను ఈ సందర్భంగా కార్యాలయం సమీక్షించింది.

జూలై 21న జకార్తాలోని హోటల్ ములియాలో జరిగిన సమావేశంలో FABC గురువుల కార్యాలయం అధ్యక్షుడు, అగ్రపీఠాధిపతి మహా పూజ్య ఉడుమల బాల కార్యాలయ నివేదికను సమర్పిస్తూ, ఆసియా శ్రీసభలో మారుతున్న పాస్టరల్ వాస్తవికతలకు అనుగుణంగా గురువుల రూపకల్పనను బలోపేతం చేయడానికి చేపట్టిన కార్యక్రమాలను వివరించారు.

తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ "మంచి కాపరి అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు" అని అగ్రపీఠాధిపతి బాల అన్నారు.

2004 జూన్‌లో స్థాపించబడిన FABC గురువుల కార్యాలయం, ఆసియాలోని పీఠాధిపతులు, గురువులు, సెమినరీ రూపకర్తలకు సదస్సులు, సంప్రదింపులు, సమావేశాల ద్వారా సేవలందిస్తోంది. లోతైన ఆధ్యాత్మిక జీవితం, సువార్త ప్రచార దృక్పథం, సేవక నాయకత్వ భావన కలిగిన గురువులను తీర్చిదిద్దడమే ఈ కార్యాలయ ప్రధాన లక్ష్యం.

అగ్రపీఠాధిపతి బాల మాట్లాడుతూ, గురువులు తమ పీఠాధిపతులతో సన్నిహిత సహకారంతో సేవ చేస్తూనే, ఆసియా సంస్కృతుల్లో వేళ్లూనుకున్న, పేదలు, ఇతర మతాల ప్రజలు, స్థానిక సంస్కృతులతో కూడిన శ్రీసభ "త్రివిధ సంభాషణ" స్ఫూర్తిని పెంపొందించే భాగస్వామ్య శ్రీసభ నిర్మాణానికి కృషి చేయాలని పేర్కొన్నారు.

"ఆసియాలోని శ్రీసభను మేము 'చిన్న మంద'గా చూస్తున్నప్పటికీ, అది సజీవమైనది, పరివర్తనకు దారితీసేది, నిరీక్షణతో నిండినది. అందువల్ల గురువులు సినడల్ స్ఫూర్తిలో వేళ్లూనుకున్న పాస్టరల్, సువార్త ప్రచార పునరుద్ధరణ దిశగా నిరంతరం ప్రోత్సహించబడాలి," అని ఆయన అన్నారు.

గత 22 సంవత్సరాలుగా కార్యాలయం నిర్వహించిన రూపకల్పన కార్యక్రమాలను నివేదిక సమీక్షించింది. 2006లో థాయ్‌లాండ్‌లోని హువా హిన్‌లో, ఆసియా సందర్భంలో గురువుల మానవీయ రూపకల్పనపై నిర్వహించిన సదస్సుతో ఈ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.

గురువుల కార్యాలయం అధ్యక్షుడు అగ్రపీఠాధిపతి ఉడుమల బాల
జూలై 21న FABC గురువుల కార్యాలయం అధ్యక్షుడు అగ్రపీఠాధిపతి ఉడుమల బాల కార్యాలయ నివేదికను సమర్పిస్తూ, ఆసియా శ్రీసభలో మారుతున్న పాస్టరల్ వాస్తవికతలకు అనుగుణంగా గురువుల రూపకల్పనను బలోపేతం చేయడానికి చేపట్టిన కార్యక్రమాలను వివరించారు.

పాస్టరల్ సవాళ్లు మారుతున్న కొద్దీ, వ్యక్తిగత, సేవాపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న గురువులకు తోడుగా నిలిచే దిశగా కార్యాలయం తన కార్యక్రమాలను విస్తరించింది. 2008లో నిర్వహించిన సదస్సు సంక్షోభంలో ఉన్న గురువుల సంరక్షణపై దృష్టి సారించగా, మరో సమావేశం గురుత్వ గుర్తింపు, పిలుపు వంటి అంశాలను చర్చించింది.

తదుపరి సంవత్సరాల్లో రక్షణ విధానాలు (Safeguarding), గురువుల గురుజీవితం, సమగ్ర గురుత్వ రూపకల్పన, సువార్త ప్రచారం వంటి అంశాలపై కార్యాలయం పలు కార్యక్రమాలు నిర్వహించింది. కోవిడ్-19 మహమ్మారి అనంతరం రక్షణ విధానాలు, సినడాలిటీ, సెమినరీల పునరుద్ధరణకు మరింత ప్రాధాన్యం ఇచ్చింది. 2022లో Catholic Safeguarding Institute Manilaతో కలిసి పిల్లలు, బలహీన వర్గాల రక్షణను బలోపేతం చేసే కార్యక్రమాలు చేపట్టింది. అనంతరం 2023, 2024 సంవత్సరాల్లో గురువులు, సెమినరీ రూపకర్తల కోసం సినడాలిటీపై ప్రత్యేక రూపకల్పన కార్యక్రమాలను నిర్వహించింది.

ప్రస్తుతం కార్యాలయ రూపకల్పన కార్యక్రమాలకు సినడాలిటీనే మార్గదర్శక సూత్రంగా తీసుకున్నామని అగ్రపీఠాధిపతి బాల తెలిపారు. 2025లో ఆసియాలోని ప్రధాన సెమినరీల రెక్టర్లను ఒకచోట చేర్చి, FABC 50 పత్రం స్ఫూర్తితో ఉమ్మడి రూపకల్పన వనరులను అభివృద్ధి చేశామని, భవిష్యత్తు గురువులు సినడాలిటీని కేవలం సేవా విధానంగా కాకుండా జీవన విధానంగా కూడా స్వీకరించేలా ఈ కార్యక్రమం దోహదపడిందని ఆయన వివరించారు.

భవిష్యత్తులో FABC దైవాంకితుల కార్యాలయం, సామాన్య విశ్వాసుల మరియు కుటుంబ కార్యాలయం, విద్య మరియు విశ్వాస రూపకల్పన కార్యాలయం, అలాగే సినడాలిటీ కమిషన్ తో  కలిసి మరింత సన్నిహిత సహకారం కొనసాగించాలని కార్యాలయం ప్రణాళిక రూపొందించింది. పర్యావరణ పరిరక్షణ, కృత్రిమ మేధస్సు (Artificial Intelligence), డిజిటల్ సంస్కృతి వంటి నూతన సవాళ్లను ఎదుర్కొనేందుకు అవసరమైన దైవశాస్త్ర వనరులు, పాస్టరల్ మార్గదర్శకాలు, రూపకల్పన కార్యక్రమాలను సంయుక్తంగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

గురుత్వ రూపకల్పన అనేది సెమినరీతో ముగిసిపోయే ప్రక్రియ కాదని, గురువు సేవా జీవితమంతా నిరంతరం కొనసాగాల్సిన ఆధ్యాత్మిక, పాస్టరల్ ప్రయాణమని నివేదిక ముగింపులో స్పష్టం చేసింది. ఈ నిరంతర రూపకల్పన ద్వారానే గురువులు దేవుని ప్రజలతో సన్నిహితంగా కలిసి నడుస్తూ, ఆసియాలో మరింత సినడల్, సువార్త ప్రచార స్ఫూర్తి కలిగిన శ్రీసభకు నాయకత్వం వహించగలరని కార్యాలయం పేర్కొంది.