సినడల్ పరివర్తన అంటే ఇతరులను క్రీస్తు దృష్టితో చూడడం నేర్చుకోవడం: కార్డినల్ టాగ్లే
Federation of Asian Bishops' Conferences (FABC) 12వ ప్లీనరీ సమావేశంలో భాగంగా జూలై 22న నిర్వహించిన పూర్తి దిన ఆధ్యాత్మిక ధ్యాన కార్యక్రమంలో, సినడల్ పునరుద్ధరణ అనేది శ్రీసభ నిర్మాణాలు లేదా సేవాపర కార్యక్రమాల్లో మార్పులతో కాకుండా, శ్రీసభ నాయకులు ఇతరులను చూసే విధానంలో పరివర్తనతో ప్రారంభమవుతుందని కార్డినల్ లూయిస్ ఆంటోనియో జి. టాగ్లే పేర్కొన్నారు.
"ఇవికంటే గొప్ప కార్యాలను చూస్తావు... సేవాపర నాయకుల సినడల్ పరివర్తనకు పిలుపు" అనే అంశంపై జరిగిన తన రెండవ ధ్యాన ప్రసంగంలో కార్డినల్ టాగ్లే మాట్లాడుతూ, సేవాపర నాయకులు ఇతరులను పక్షపాతం, మూసధారణలు లేదా కేవలం మానవ ప్రమాణాల ఆధారంగా చూస్తూనే ఉంటే, శ్రీసభ సినడల్ ప్రయాణం ఫలవంతం కాదని హెచ్చరించారు.
"నిజమైన సినడల్ పరివర్తన అంటే, యేసు ఇతరులను ఎలా చూస్తారో అలా చూడడం నేర్చుకోవడంతో ప్రారంభమవుతుంది," అని ఆయన అన్నారు.
నతనయేలు యేసును కలిసిన సువార్త ఘట్టాన్ని ప్రస్తావిస్తూ, మెస్సీయ నజరేతు నుంచి వచ్చాడని విన్నప్పుడు నతనయేలు అడిగిన "నజరేతు నుంచి ఏదైనా మంచి వస్తుందా?" అనే ప్రశ్నపై కార్డినల్ టాగ్లే ధ్యానించారు. ఈ సంఘటన మనుషులు ఇతరులను గురించి ఏర్పరచుకునే అభిప్రాయాలు తరచుగా సాంస్కృతిక భావనలు, వ్యక్తిగత అనుభవాల ప్రభావంతో ఎలా రూపుదిద్దుకుంటాయో తెలియజేస్తుందని ఆయన చెప్పారు.
"నతనయేలుకు ఎవరు గొప్పవారు, ఎవరు తక్కువవారు అనే తన సొంత ప్రమాణాలు ఉండేవి. తన స్వగ్రామమే నజరేతు కంటే గొప్పదని అతను భావించాడు. కానీ యేసు అతనిలో మరింత గొప్పదాన్ని చూసినప్పుడు ఆ దృష్టికోణం పూర్తిగా మారిపోయింది," అని కార్డినల్ అన్నారు.
నతనయేలు పక్షపాతాన్ని మందలించకుండా, యేసు ముందుగా అతనిలోని మంచితనాన్ని గుర్తించి, "ఇతడు నిజమైన ఇశ్రాయేలీయుడు; ఇతనిలో కపటమేమీ లేదు" అని చెప్పారని ఆయన గుర్తుచేశారు. ఇతరులు ఒక వ్యక్తిలో పరిమితులనే చూసినప్పుడు కూడా, క్రీస్తు ఆ వ్యక్తి యొక్క నిజమైన అంతరంగ గుర్తింపును దర్శిస్తారని ఈ సంఘటన తెలియజేస్తుందని కార్డినల్ టాగ్లే వివరించారు.
"మనం సాధారణ విషయాలుగానో, సమస్యలుగానో చూసే చోట యేసు గొప్పదాన్ని దర్శిస్తారు. మనమే గుర్తించని గొప్పతనాన్ని ఆయన మనకు కనుగొనడంలో సహాయపడతారు," అని ఆయన అన్నారు.
ప్రతి వ్యక్తిలోని మంచితనపు విత్తనాలను, దేవుని పిలుపును గుర్తించే "యేసు దృష్టిని" సేవాపర నాయకులు అలవరచుకోవాలని కార్డినల్ టాగ్లే పిలుపునిచ్చారు. అలాంటి అంతరంగ పరివర్తన లేకపోతే శ్రీసభ నాయకత్వం పైపైనదిగా, కొంతమందికే పరిమితమైనదిగా మారే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.
ఈ సందర్భంగా తన వ్యక్తిగత అనుభవాన్ని కూడా ఆయన పంచుకున్నారు. కొన్నిసార్లు అద్దంలో తనను తాను చూసుకుంటూ, "నేను యేసునైతే, ఈ వ్యక్తిని కార్డినల్గా ఎన్నుకునేవాడిని కాదు" అని తనకు అనిపిస్తుందని ఆయన తెలిపారు.
గురువుగా అభిషేకం పొందే ముందు కూడా తనకు ఇలాంటి సందేహాలే వచ్చాయని, అయితే చివరకు తన స్వంత తీర్పుకన్నా దేవుని నిర్ణయాన్ని విశ్వసించడం నేర్చుకున్నానని ఆయన చెప్పారు.
"పిలిచేది నీవే. నేను చూడనిదాన్ని నీవు చూస్తున్నావు. అందుకే నీవు చూసే విధానాన్ని నేను విశ్వసిస్తున్నాను," అని తాను ప్రార్థించిన విషయాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు.
అనేక మంది తమ నేపథ్యం, సంస్కృతి లేదా సామాజిక స్థితి ఆధారంగా తీర్పు పొందడం వల్ల, తమలోని పూర్తి సామర్థ్యాన్ని ఎన్నడూ వికసింపజేసుకోలేకపోతున్నారని కార్డినల్ టాగ్లే అన్నారు.
"బహుశా శ్రీసభలో కూడా, కొంతమందిలో ఉన్న మంచితనాన్ని గానీ, గొప్పతనాన్ని గానీ మనం ఎన్నడూ గుర్తించకపోవడం వల్ల వారు పూర్తిగా వికసించలేకపోయి ఉండవచ్చు," అని ఆయన అన్నారు.
తన ప్రసంగాన్ని ముగిస్తూ, సేవాపర నాయకత్వాన్ని తమ సాంస్కృతిక అభిప్రాయాలు, అలవాట్లు లేదా పక్షపాతాలు ప్రభావితం చేస్తున్నాయా అని ప్రతి ఒక్కరూ ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆయన ఆహ్వానించారు. సువార్త మన హృదయాన్ని శుద్ధి చేయడానికి అనుమతించి, ఇతరులను క్రీస్తు దృష్టితో చూడడం నేర్చుకున్నప్పుడే నిజమైన సినడల్ పరివర్తన ప్రారంభమవుతుందని కార్డినల్ టాగ్లే స్పష్టం చేశారు.