పదవుల కంటే ముందు బాప్తిస్మమే మన గుర్తింపు: FABC ప్లీనరీ సమావేశంలో కార్డినల్ మారియో గ్రెక్
పీఠాధిపతులు, గురువులు, కార్డినల్స్ లేదా సామాన్య విశ్వాసుల నాయకులుగా ఉండకముందు, మనమందరం బాప్తిస్మం పొందిన క్రైస్తవులమే అని పీఠాధిపతుల సినడ్ ప్రధాన కార్యదర్శి కార్డినల్ మారియో గ్రెక్ జూలై 24న జకార్తాలో జరిగిన Federation of Asian Bishops' Conferences (FABC) 12వ ప్లీనరీ సమావేశంలో తెలిపారు.
"సినడ్ అమలు కోసం మార్గాలు" అనే అంశంపై ప్రసంగించిన ఆయన, శ్రీసభ నాయకులకు బాప్తిస్మమే శ్రీసభ గుర్తింపుకు, సేవకు పునాది అని, పదవి లేదా హోదా కాదని గుర్తుచేశారు.
ఆసియా నలుమూలల నుంచి వచ్చిన పీఠాధిపతులు స్థానిక శ్రీసభల్లో సినడాలిటీ ఎలా ఆచరణలోకి రావాలనే అంశంపై చర్చిస్తున్న జకార్తాలోని హోటల్ ములియా వాండా హాల్లో ఆయన ఈ సందేశాన్ని అందించారు.
ఆయనను వేదికపై పరిచయం చేస్తూ వివిధ శ్రీసభ హోదాలను ప్రస్తావించినప్పుడు, కార్డినల్ గ్రెక్ చిరునవ్వుతో ఆ పరిచయాన్ని సున్నితంగా అడ్డుకున్నారు.
"మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయారు," అని చిరునవ్వుతో అన్నారు. "మనమందరం బాప్తిస్మం పొందినవారమని చెప్పడం మర్చిపోయారు."
ఆ వ్యాఖ్య సభలో ఆహ్లాదకరమైన నవ్వులు పూయించినప్పటికీ, ఆయన ప్రసంగమంతటికీ అదే ప్రధాన స్వరంగా నిలిచింది.
"మనం ఇక్కడ ఉన్నది బాప్తిస్మం పొందినవారమనే కారణంతోనే. బాప్తిస్మమే మన జీవితానికి మూలశిల," అని ఆయన అన్నారు.
కార్డినల్ గ్రెక్ అభిప్రాయం ప్రకారం, సినడాలిటీపై సినడ్ అమలు ప్రక్రియ నిర్మాణాలు లేదా వ్యూహాలతో కాకుండా, బాప్తిస్మం ద్వారా ఏకమైన దేవుని ప్రజలు అనే శ్రీసభ ప్రాథమిక గుర్తింపును తిరిగి సజీవం చేయడం ద్వారా ప్రారంభం కావాలి.
బాప్తిస్మం పొందిన వారందరికీ సమాన గౌరవం ఉందని శ్రీసభ గుర్తించినప్పుడే సినడాలిటీ నిజంగా వికసిస్తుందని ఆయన తెలిపారు.
ప్రతి పిలుపు బాప్తిస్మం నుంచే ఉద్భవిస్తుందని ఆయన వివరించారు. పీఠాధిపతులు, గురువులు, కన్యస్త్రీలు, సామాన్య విశ్వాసులకు వేర్వేరు సేవలు ఉన్నప్పటికీ, క్రీస్తు సేవలో భాగస్వాములవ్వాలనే బాప్తిస్మ పిలుపు అందరికీ ఒకటేనని చెప్పారు.
"అందరి భాగస్వామ్యం కేవలం సినడ్ అంశం మాత్రమే కాదు; అది ముందుగా సినడ్ విధానంగా మారాలి," అని ఆయన పేర్కొన్నారు.
అందుకే ప్రపంచవ్యాప్త సినడ్ ప్రయాణం రోమ్లో కాకుండా, ప్రపంచంలోని స్థానిక మేత్రాసనాల్లో ప్రారంభమైందని ఆయన గుర్తుచేశారు. విశ్వజనీన స్థాయి చర్చలకు ముందుగా పీఠాధిపతులు గురువులు, కన్యస్త్రీలు, సామాన్య విశ్వాసులను ఆలకించేలా ఆ ప్రక్రియ రూపుదిద్దుకుందని వివరించారు.
ప్రతి క్రైస్తవుని బాప్తిస్మ గౌరవాన్ని నొక్కిచెప్పిన కార్డినల్ గ్రెక్, సినడాలిటీ పీఠాధిపతుల సేవను బలహీనపరుస్తుందనే అభిప్రాయాన్ని తిరస్కరించారు. సమాజ జీవితంలోనే పీఠాధిపతి సేవను మరింత బలంగా పాతుకుపోయేలా చేయడం ద్వారానే సినడాలిటీ దానిని బలోపేతం చేస్తుందని ఆయన అన్నారు.
"పీఠాధిపతి లేకుండా శ్రీసభ ఉండదు. కానీ విశ్వాసుల సమాజం లేకుండా పీఠాధిపతి కూడా ఉండడు," అని ఆయన పునరుద్ఘాటించారు.
పీఠాధిపతి సేవ ఒంటరిగా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా కాకుండా, తనకు అప్పగించబడిన విశ్వాస సమాజంతో కలిసి దేవుని చిత్తాన్ని ఆధ్యాత్మిక విచక్షణ ద్వారా గుర్తించడం ద్వారా పరిపూర్ణమవుతుందని ఆయన వివరించారు. సినడాలిటీ పీఠాధిపతి అధికారాన్ని తగ్గించడం కాదు; సంఘబంధంలో కలిసి ప్రయాణించే స్థానిక శ్రీసభకు కాపరిగా ఆయన కీలక పాత్రను మరింత స్పష్టంగా వెలుగులోనికి తీసుకువస్తుందని చెప్పారు.
సమాజాల్లో అల్పసంఖ్యాకులుగా జీవిస్తున్న ఆసియాలోని అనేక స్థానిక శ్రీసభలకు ఈ దృక్పథం ప్రత్యేక ప్రాధాన్యం కలిగి ఉందని కార్డినల్ గ్రెక్ అన్నారు. వారి బలం సంఖ్యలోనో, ప్రభావంలోనో లేదని, బాప్తిస్మం పొందిన విశ్వాసులు తమ దైనందిన జీవితంలో సువార్తకు అందించే సాక్ష్యంలోనే ఉందని ఆయన పేర్కొన్నారు.
బాప్తిస్మంపై కార్డినల్ గ్రెక్ ఉంచిన ఈ ప్రత్యేక ప్రాధాన్యం, స్థానిక శ్రీసభలు మరింత మిషనరీ, సినడల్ స్వరూపాన్ని సంతరించుకుని, ఆసియాలోని విభిన్న సంస్కృతులు, మతాల మధ్య వారధుల నిర్మాణకర్తలుగా ఎలా ఎదగాలనే అంశాన్ని పరిశీలిస్తున్న FABC ప్లీనరీ సమావేశం ప్రధాన భావనలలో ఒకదానితో ప్రతిధ్వనించింది.