దేవుని వాక్యంతోనే సినడల్ పునరుద్ధరణ ప్రారంభం కావాలి
ఆసియాలో శ్రీసభ సినడల్ పునరుద్ధరణ కొత్త నిర్మాణాలు లేదా సేవాపర కార్యక్రమాలతో కాకుండా, దేవుని వాక్యంతో మరింత లోతైన అనుభవంతో ప్రారంభం కావాలని కతోలిక బైబిల్ సమాఖ్య (Catholic Biblical Federation – CBF) ప్రధాన కార్యదర్శి గురుశ్రీ జాన్ జె. స్టెఫనోవ్, SVD పేర్కొన్నారు.
జూలై 22న జరిగిన Federation of Asian Bishops' Conferences (FABC) 12వ ప్లీనరీ సమావేశంలో ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించిన గురుశ్రీ స్టెఫనోవ్, ఆసియాలో వారధులను నిర్మించే శ్రీసభ లక్ష్యం పవిత్ర గ్రంథంపై ఆధారపడినప్పుడే ఫలిస్తుందని అన్నారు.
జకార్తాలోని హోటల్ ములియాలో జరుగుతున్న ఈ సమావేశం "సినడల్ పరివర్తన మరియు ఆసియాలో వారధులు, వారధుల నిర్మాణకర్తలుగా ఉండే సేవ" అనే అంశంతో కార్డినల్స్, పీఠాధిపతులు, గురువులు, కన్యస్త్రీలు, సామాన్య విశ్వాస ప్రతినిధులను ఆసియా నలుమూలల నుంచి ఒకచోటకు చేర్చింది.
శ్రీసభ ప్రజలు, సంస్కృతులు, మతాల మధ్య నిర్మించదలచిన ప్రతి వారధికి ముందుగా దేవుడే నిర్మించిన ఒక మౌలిక వారధి ఆధారమని గురుశ్రీ స్టెఫనోవ్ వివరించారు.
"ఆకాశానికి, భూమికి మధ్య దేవుడు నిర్మించిన తొలి వారధి పవిత్ర గ్రంథమే. అనంతరం శ్రీసభ ప్రజలు, సంస్కృతులు, మతాల మధ్య నిర్మించే ప్రతి వారధి, దేవుని వాక్యమైన ఆ తొలి వారధిపైనే నిలబడి ఉంటుంది," అని ఆయన చెప్పారు.
సినడాలిటీని కేవలం శ్రీసభను నిర్వహించే కొత్త విధానంగా లేదా నిర్ణయాలు తీసుకునే పద్ధతిగా అర్థం చేసుకోరాదని ఆయన స్పష్టం చేశారు. పవిత్ర గ్రంథం ద్వారా దేవుడు పలికే స్వరాన్ని ఆలకించడంతోనే సినడాలిటీ ప్రారంభమవుతుందని ఆయన అన్నారు.
సినడాలిటీపై జరిగిన సినడ్ తుది పత్రాన్ని ఉటంకిస్తూ, దేవుని వాక్యాన్ని ఆలకించడం "శ్రీసభ మొత్తం విచక్షణ ప్రక్రియకు ప్రారంభ బిందువూ, ప్రమాణమూ" అని గురుశ్రీ స్టెఫనోవ్ పేర్కొన్నారు.
"దేవుని వాక్యంతో సినడాలిటీ ప్రారంభం కాకపోతే అది తన పునాదిని కోల్పోతుంది. ఆలకించడం లేకుండా సినడాలిటీ లేదు. దేవుని వాక్యాన్ని ముందుగా ఆలకించకుండా నిజంగా ఆలకించే శ్రీసభ కూడా ఉండదు," అని ఆయన అన్నారు.
దేవుడు పవిత్ర ప్రార్థనా ఆరాధన, శ్రీసభ జీవంతమైన సంప్రదాయం, పవిత్ర గ్రంథంపై ప్రార్థనాపూర్వక ధ్యానం, ప్రజాభక్తి, పేదల మొర, చారిత్రక సంఘటనలు, సృష్టి, మానవ మనస్సాక్షి ద్వారా కూడా మాట్లాడుతూనే ఉన్నారని గురుశ్రీ స్టెఫనోవ్ చెప్పారు. అయితే, ఈ అన్ని మార్గాల మూలం చివరికి దేవుని వాక్యమేనని ఆయన స్పష్టం చేశారు.
పవిత్ర గ్రంథ సేవను పునరుజ్జీవింపజేయాలని కూడా ఆయన ఆసియా పీఠాధిపతులను కోరారు. FABC తన సేవాపర దృక్పథంలో పవిత్ర గ్రంథానికి ఎప్పటినుంచో కేంద్రస్థానం కల్పించిందని ఆయన గుర్తు చేశారు.
ఆ దృఢనిశ్చయంతోనే బిషప్స్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది బిబ్లికల్ అపోస్టలేట్ (BIBA) స్థాపించబడిందని, అది దశాబ్దాలుగా కతోలిక బైబిల్ సమాఖ్యతో కలిసి ఆసియా అంతటా పవిత్ర గ్రంథ శిక్షణను బలోపేతం చేస్తూ వస్తోందని ఆయన తెలిపారు.
1999లో మలేషియాలో జరిగిన BIBA II ఆసియా ఖండంలో అత్యంత సమగ్ర పవిత్ర గ్రంథ శిక్షణ కార్యక్రమాల్లో ఒకటిగా నిలిచిందని, అనంతరం BIBA III (2010), BIBA IV (2013) నిర్వహించబడిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
గత పదేళ్లలో పవిత్ర గ్రంథ సేవ ఉత్సాహం కొంత మందగించినప్పటికీ, FABC ప్లీనరీ సమావేశం ఆ నిబద్ధతను తిరిగి పునరుద్ధరించేందుకు గొప్ప అవకాశమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
"ఏదీ నిజంగా కోల్పోలేదు. ఆ గొప్ప వారసత్వం ఇప్పటికీ మనతోనే ఉంది. అయితే ఒకప్పుడు కనిపించిన ఆ జీవంతమైన ఉత్సాహం మళ్లీ ప్రజ్వలించబడటానికి ఎదురుచూస్తున్నట్లుగా అనిపిస్తోంది," అని ఆయన అన్నారు.
తాను ప్రతిపాదించేది మరో కొత్త సేవాపర కార్యక్రమం కాదని, పరిశుద్ధ బెనెడిక్ట్ పాపు గారు అపోస్తలిక ప్రబోధం వెర్బయం డొమిని బోధించినట్లుగా, శ్రీసభ సేవలోని ప్రతి అంశానికి పవిత్ర గ్రంథమే ప్రేరణగా మారాలని గురుశ్రీ స్టెఫనోవ్ చెప్పారు.
"పవిత్ర గ్రంథం శ్రీసభ మొత్తం సేవాపర జీవితానికి ప్రేరణాస్రోతస్విగా మారాలి," అని ఆయన అన్నారు.
పవిత్ర గ్రంథాన్ని చదవడం, తెరిచిన హృదయంతో ఆలకించడం, కలిసి విచక్షణ చేయడం వంటి అంశాల్లో శిక్షణ పొందిన మరింత మంది మహిళలు, పురుషులు ఆసియా శ్రీసభలకు అవసరమని ఆయన పేర్కొన్నారు. అలాంటి శిక్షణ సినడల్ పరివర్తనను నిలబెట్టేందుకు అత్యంత అవసరమని వివరించారు.
కతోలిక బైబిల్ సమాఖ్య తన అంతర్జాతీయ నెట్వర్క్, శిక్షణ వనరులు, సహకారం ద్వారా ఆసియా శ్రీసభలకు అండగా నిలవడానికి సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.
చివరగా, శ్రీసభ కోరుకుంటున్న పునరుద్ధరణను సంస్థాగత సంస్కరణలతో కాకుండా, దేవుని వాక్యంతో పరివర్తన చెందిన హృదయాలతోనే కొలవాలని గురుశ్రీ స్టెఫనోవ్ అన్నారు.
అలాంటి పునాదిపైనే శ్రీసభ దేవుని చిత్తాన్ని గ్రహించి, విశ్వాసంలో కలిసి నడుస్తూ, ఆసియా అంతటా నిరీక్షణకు వారధిగా తన సేవను నెరవేర్చగలదని ఆయన పేర్కొన్నారు.