దేవుని నిశ్శబ్ద కార్యాల్లో నిరీక్షణను కనుగొనండి: కార్డినల్ టాగ్లే

కార్డినల్ టాగ్లే
2026 జూలై 22న జరిగిన FABC 12వ ప్లీనరీ సమావేశంలోని ఆధ్యాత్మిక ధ్యాన కార్యక్రమంలో కార్డినల్ లూయిస్ ఆంటోనియో టాగ్లే మాట్లాడుతూ, మానవ విజయాల వల్ల కాదు, దైనందిన జీవితంలో దేవుడు నిశ్శబ్దంగా చేస్తున్న కార్యాలను గుర్తించడం ద్వారానే క్రైస్తవ నిరీక్షణ బలపడుతుందని చెప్పారు.

మనుషుల విజయాలపై కాదు, దైనందిన జీవితంలో దేవుడు నిశ్శబ్దంగా చేస్తున్న కార్యాలను గుర్తించడంపైనే క్రైస్తవ నిరీక్షణ నిలిచి ఉంటుందని, Federation of Asian Bishops' Conferences (FABC) 12వ ప్లీనరీ సమావేశంలో భాగంగా జూలై 22న నిర్వహించిన ఒకరోజు ఆధ్యాత్మిక ధ్యాన కార్యక్రమంలో కార్డినల్ లూయిస్ ఆంటోనియో జి. టాగ్లే పాల్గొన్న ప్రతినిధులకు తెలిపారు.

ఆసియా నలుమూలల నుంచి వచ్చిన పీఠాధిపతులు, ప్రతినిధులు పాల్గొన్న ఈ ఆధ్యాత్మిక ధ్యాన కార్యక్రమం, ప్లీనరీ సమావేశ చర్చలకు ముందు వారిని ఆధ్యాత్మికంగా సిద్ధం చేయడానికి నిర్వహించబడింది.

"మీరు గొప్ప కార్యాలను దర్శిస్తారు… సేవాపర నాయకుల సినడల్ పరివర్తనకు ఒక పిలుపు" అనే అంశంపై తన ఆధ్యాత్మిక సందేశాన్ని అందించిన కార్డినల్ టాగ్లే, శ్రీసభ లక్ష్యం గొప్ప కార్యాలను చేయడం కాదని, క్రీస్తు ఇప్పటికే చేస్తున్న గొప్ప కార్యాలను గుర్తించడమేనని చెప్పారు.

"పవిత్ర గ్రంథంలో 'మీరు గొప్ప కార్యాలు చేస్తారు' అని లేదు. యేసు 'మీరు గొప్ప కార్యాలను దర్శిస్తారు' అని చెప్పారు. గొప్ప కార్యాలను చేసేది యేసే. వాటిని గుర్తించడం మన బాధ్యత," అని ఆయన అన్నారు.

యోహాను సువార్తలో నతానియేలు యేసును కలుసుకున్న సంఘటనను ప్రస్తావిస్తూ, "మీరు గొప్ప కార్యాలను దర్శిస్తారు" అనే వాగ్దానం, శిష్యులు తమ సొంత విజయాలపై ఆధారపడకుండా, దేవుడు చేస్తున్న కార్యాలను గుర్తించే దృష్టిని అలవరచుకోవాలని పిలుపునిస్తుందని కార్డినల్ టాగ్లే వివరించారు.

ఇదే సినడల్ ఆధ్యాత్మికతకు హృదయమని ఆయన పేర్కొన్నారు. సేవాపర నాయకులు కాసేపు ఆగి, ఆలకించి, సాధారణ ప్రజలలోను, దైనందిన జీవిత సంఘటనలలోను దేవుని సన్నిధిని గుర్తించగల ధ్యానపూర్వక మనోభావాన్ని పెంపొందించుకోవాలని ఆయన సూచించారు. అలాంటి దృష్టి లేకపోతే, శ్రీసభ తన సేవ పూర్తిగా మానవ ప్రయత్నాలపైనే ఆధారపడి ఉందనే అపోహలో పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

తన సందేశాన్ని వివరించేందుకు యోహాను సువార్తలోని పలు సంఘటనలను కార్డినల్ టాగ్లే ప్రస్తావించారు. కానా వివాహ విందులో సాధారణ సామాజిక ఇబ్బందిగా కనిపించిన పరిస్థితిని యేసు నీటిని ద్రాక్షారసంగా మార్చడం ద్వారా తన తొలి అద్భుత సూచనగా మలిచారని ఆయన గుర్తు చేశారు. అలాగే బావి వద్ద జరిగిన సాధారణ సంభాషణలో సమరయ స్త్రీ మెస్సీయాను కలుసుకుందని, మగ్దల మరియ మొదట పునరుత్థాన ప్రభువును తోటమాలిగా భావించిందని, ఎమ్మావుకు వెళ్తున్న శిష్యులు రొట్టె విరిచినప్పుడు మాత్రమే ఆయనను గుర్తించారని ఆయన చెప్పారు.

"యేసు చేసే గొప్ప కార్యాలు సాధారణ విషయాల ద్వారానే వ్యక్తమవుతాయి. దేవుడు చేస్తున్న కార్యాల పట్ల ఆశ్చర్యభావాన్ని తిరిగి పొందడం కూడా మన పరివర్తనలో ఒక భాగం," అని కార్డినల్ టాగ్లే అన్నారు.

సాధారణ క్షణాల్లో దేవుని సన్నిధిని గుర్తించగల ఆశ్చర్యభావాన్ని కాపాడుకోవాలని ఆయన శ్రీసభ నాయకులను ప్రోత్సహించారు. నేటి సేవాపర, సామాజిక సవాళ్ల మధ్య అలాంటి దృష్టి పరిపక్వమైన విశ్వాసానికి గుర్తని, నిరీక్షణకు మూలమని ఆయన చెప్పారు.

దీనిని వివరించేందుకు మనీలాలో తనకు ఎదురైన ఒక అనుభవాన్ని కార్డినల్ టాగ్లే పంచుకున్నారు. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగినప్పుడు ఒక వీధి వ్యాపారి తనకు చిరుతిండ్లు అమ్మడానికి వచ్చాడని అనుకున్నానని, కానీ అతను వాటిని కానుకగా అందించాడని చెప్పారు.

"ఒక సాధారణ వీధి వ్యాపారి ద్వారా మేము గొప్ప విషయాన్ని దర్శించాము. లాభం సంపాదించడం కంటే ఇవ్వడం ఎంతో గొప్పదని అతను మాకు నేర్పించాడు," అని ఆయన గుర్తుచేశారు.

లెబనాన్‌లో వివిధ మతాలకు చెందిన శరణార్థులకు శ్రీసభ మానవతా సహాయం అందించిన అనంతరం వారిని కలిసిన సందర్భాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఆ సమయంలో ఒక చిన్నారి తనతో, "ఆ యేసుతో నేను స్నేహం చేయాలనుకుంటున్నాను," అని చెప్పిన మాటలు, ప్రేమతో చేసిన చిన్న సేవలు కూడా సువార్తకు హృదయాలను తెరవగలవని వెల్లడించాయని కార్డినల్ టాగ్లే అన్నారు.

తన ఆధ్యాత్మిక సందేశాన్ని ముగిస్తూ, యేసు వాగ్దానం చేసిన "గొప్ప కార్యాలు" పునరుత్థానంలోనే సంపూర్ణంగా వ్యక్తమవుతాయని కార్డినల్ టాగ్లే గుర్తుచేశారు. పునరుత్థాన ప్రభువు నేటికీ సాధారణ మనుషుల ద్వారా, ప్రేమతో కూడిన చిన్నచిన్న కార్యాల ద్వారా పనిచేస్తూనే ఉన్నారని, అందువల్ల ఆధునిక ప్రపంచంలోని సవాళ్ల మధ్య కూడా శ్రీసభకు నిరీక్షణకు ఎన్నటికీ తరుగని కారణం ఉందని ఆయన అన్నారు.