ఆసియాలో పెరుగుతున్న విభజనలపై FABCని హెచ్చరించిన మలయా విశ్వవిద్యాలయ అధ్యాపకురాలు
ఆసియాలో శ్రీసభ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు హింస లేదా లౌకికీకరణ కాదని, సమాజంలో పెరుగుతున్న విభజన (Polarization) అని మలేషియాలోని కౌలాలంపూర్ మలయా విశ్వవిద్యాలయం ఆగ్నేయాసియా అధ్యయనాల విభాగానికి చెందిన సీనియర్ అధ్యాపకురాలు డాక్టర్ చోంగ్ పుయ్ యీ హెచ్చరించారు.
జూలై 23న జకార్తాలో జరిగిన Federation of Asian Bishops' Conferences (FABC) 12వ ప్లీనరీ సమావేశంలో ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించిన డాక్టర్ చోంగ్, ఆసియా వ్యాప్తంగా పెరుగుతున్న రాజకీయ, జాతి, భావజాల విభేదాలు క్రమంగా శ్రీసభ జీవితంలోనూ ప్రతిఫలిస్తున్నాయని పేర్కొన్నారు.
"ఆసియా మారుతున్న సందర్భం మరియు మిషనరీ సినడల్ శ్రీసభ వారధులు, వారధుల నిర్మాణకర్తలుగా ఉండేందుకు ఆచరణాత్మక మార్గాలు" అనే అంశంపై ఆమె ప్రసంగిస్తూ, ఖండంలోని సామాజిక, రాజకీయ వాస్తవికతలు శ్రీసభ సినడల్ సేవపై చూపుతున్న ప్రభావాన్ని విశ్లేషించారు.
"రాజకీయ, జాతి, సామాజిక విభేదాలు శ్రీసభ ద్వారం వద్దే ఆగిపోవు," అని ఆమె పేర్కొంటూ తన ప్రసంగంలోని ప్రధాన సందేశాన్ని స్పష్టం చేశారు.
సామాజిక ఉద్యమాలు, గుర్తింపు రాజకీయాలు (Identity Politics), మతం, ప్రజా జీవితం వంటి అంశాలపై పరిశోధనలు చేస్తున్న డాక్టర్ చోంగ్ మాట్లాడుతూ, వలసలు, మత జాతీయవాదం, ప్రజాస్వామ్య అవకాశాల క్షీణత, వేగవంతమైన డిజిటల్ సమాచార ప్రసారం వంటి కారణాలతో ఆసియా లోతైన సామాజిక పరివర్తనను అనుభవిస్తోందని తెలిపారు. ఈ పరిణామాలన్నీ చివరకు ఒకే వాస్తవానికి—అంటే పెరుగుతున్న విభజనకు—దారితీస్తున్నాయని ఆమె అన్నారు.
ప్రత్యేకంగా "భావోద్వేగ విభజన (Affective Polarization)" అనే అంశాన్ని ప్రస్తావిస్తూ, భిన్నాభిప్రాయాలు కలిగిన వారిని ప్రజలు ఇక చట్టబద్ధమైన ప్రత్యర్థులుగా కాకుండా శత్రువులుగా చూడడం ప్రారంభిస్తున్నారని ఆమె వివరించారు.
"అలా జరిగినప్పుడు సంభాషణ కష్టమవుతుంది. ఎందుకంటే ప్రజలు ఒకరి మాట మరొకరు వినడం మానేస్తారు," అని ఆమె అన్నారు.
సామాజిక మాధ్యమాలు, డిజిటల్ వేదికలు ఇప్పటికే ఉన్న అభిప్రాయాలనే బలపరిచే సమాచార గోళాలను (Information Bubbles) సృష్టించడం ద్వారా, భిన్న దృక్పథాల పట్ల అపనమ్మకాన్ని మరింత పెంచుతున్నాయని డాక్టర్ చోంగ్ తెలిపారు.
క్రైస్తవులు కూడా ఈ సామాజిక ప్రభావాలకు అతీతులు కాదని ఆమె హెచ్చరించారు. సమాజ సభ్యులుగా వారు రాజకీయ, జాతి, భావజాల విభేదాలను సులభంగా విచారణ సంఘాలు, శ్రీసభ సమాజాల్లోకి తీసుకురాగలరని ఆమె పేర్కొన్నారు.
దీని ఫలితంగా రాజకీయాలు, జాతి, సంస్కృతి ఆధారంగా ఏర్పడిన గుర్తింపులు, క్రీస్తు అనుచరులుగా విశ్వాసులందరికీ ఉన్న ఉమ్మడి గుర్తింపును మరుగున పడేసే ప్రమాదం ఉందని ఆమె అన్నారు.
ఆసియాలోని శ్రీసభకు ఉన్న అసలు సవాలు అనేక దేశాల్లో అల్పసంఖ్యాకులుగా మనుగడ సాగించడం మాత్రమే కాదని, విభజనలతో నిండిన సమాజంలో ఐక్యతకు విశ్వసనీయ చిహ్నంగా నిలవడమని ఆమె పేర్కొన్నారు.
"భిన్నాభిప్రాయాలు శత్రుత్వానికి దారితీయాల్సిన అవసరం లేదని శ్రీసభ తన జీవితంతో చూపించాలి," అని ఆమె అన్నారు.
సమాజంలోని ఘర్షణలను అనుకరించే బదులు, సంభాషణ, సమరసత, పరస్పర గౌరవం వికసించే స్థలంగా శ్రీసభ రూపుదిద్దుకోవాలని డాక్టర్ చోంగ్ పిలుపునిచ్చారు. ఆసియా వంటి సాంస్కృతిక, మత, రాజకీయ వైవిధ్యంతో కూడిన ఖండంలో ఇటువంటి సాక్ష్యం అత్యంత అవసరమని ఆమె చెప్పారు.
మత జాతీయవాదం లేదా గుర్తింపు రాజకీయాలు శ్రీసభ సేవను నిర్దేశించకూడదని కూడా ఆమె హెచ్చరించారు. సాంస్కృతిక, జాతీయ గుర్తింపుల ప్రాముఖ్యతను అంగీకరిస్తూనే, రాజకీయ, జాతి, జాతీయ విధేయతల కంటే క్రీస్తులోని తన గుర్తింపుకే శ్రీసభ ఎల్లప్పుడూ ప్రాధాన్యం ఇవ్వాలని ఆమె నొక్కిచెప్పారు.
"క్రీస్తులో ఐక్యమైన సమాజంగా తన గుర్తింపును శ్రీసభ ధైర్యంగా ప్రకటించాలి," అని ఆమె అన్నారు.
తన ప్రసంగమంతా FABC ప్లీనరీ సమావేశ అంశమైన "వారధులు, వారధుల నిర్మాణకర్తలు" అనే భావనను ఆమె పునరుద్ఘాటించారు. విభజనలు ఉన్న చోటే వారధులు అవసరమవుతాయని, అందువల్ల సమరసతను నెలకొల్పడం నేడు శ్రీసభ అత్యవసర బాధ్యతల్లో ఒకటిగా మారిందని ఆమె పేర్కొన్నారు.
తన ప్రసంగాన్ని ముగిస్తూ, విభజనలకు శ్రీసభ ఇచ్చే ప్రతిస్పందన రాజకీయ అధికారంపైనో, భావజాల విజయంపైనో ఆధారపడకూడదని ఆమె అన్నారు. ప్రేమ, కరుణ, క్షమాపణ, సమరసతకు పిలుపునిచ్చే సువార్త సందేశమే శ్రీసభ అందించగల ప్రత్యేకమైన సాక్ష్యమని ఆమె స్పష్టం చేశారు.
సినడాలిటీ అనేది కేవలం నిర్మాణాలు, విధానాల ద్వారా మాత్రమే కాకుండా, భిన్నతలు విభజనలుగా మారకుండా, సంఘబంధం ఘర్షణల కంటే బలంగా నిలిచే విశ్వాస సమాజాలను నిర్మించడం ద్వారా కూడా ఆచరణలో కనిపించాలని డాక్టర్ చోంగ్ చేసిన ఈ ఆలోచనాత్మక ప్రసంగం, జకార్తాలో సమావేశమైన పీఠాధిపతులు, ప్రతినిధులకు సవాలు విసిరింది.