FABC ప్లీనరీ సమావేశ ప్రారంభోత్సవంలో సినడల్ స్ఫూర్తిని ప్రతిబింబించిన ఇండోనేషియా సాంస్కృతిక వారసత్వం

ఇండోనేషియా సాంస్కృతిక వారసత్వం
జూలై 21న జకార్తాలో జరిగిన FABC 12వ ప్లీనరీ సమావేశ ప్రారంభోత్సవంలో, ఇండోనేషియా ఆసియా నలుమూలల నుంచి విచ్చేసిన పీఠాధిపతులు, శ్రీసభ నాయకులకు సాంప్రదాయ సంగీతం, నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో ఘన స్వాగతం పలికింది.

జూలై 21న జకార్తాలోని హోటల్ ములియాలో ప్రారంభమైన Federation of Asian Bishops' Conferences (FABC) 12వ ప్లీనరీ సమావేశానికి ఆసియా నలుమూలల నుంచి విచ్చేసిన పీఠాధిపతులు, శ్రీసభ నాయకులకు ఇండోనేషియా తన సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వంతో ఘన స్వాగతం పలికింది. సాంప్రదాయ సంగీతం, నృత్యాలు, స్థానిక సాంస్కృతిక వ్యక్తీకరణల ద్వారా సినడల్ శ్రీసభగా కలిసికట్టుగా నడవాలనే సమావేశ పిలుపును ప్రతిబింబించింది.

FABC 2026 కార్యక్రమాల నిర్వహణ కమిటీ అధ్యక్షుడు గురుశ్రీ హాన్స్ జెహరుట్ మాట్లాడుతూ, ఈ సాంస్కృతిక ప్రదర్శనలు కేవలం వినోద కార్యక్రమాలు కాదని, ఇండోనేషియా శ్రీసభ విశ్వాసాన్ని, సంస్కృతిని ప్రతిబింబించే ఉద్దేశ్యపూర్వక వ్యక్తీకరణలని తెలిపారు.

గురుశ్రీ హాన్స్ జెహరుట్
FABC 2026 కార్యక్రమాల నిర్వహణ కమిటీ అధ్యక్షుడు గురుశ్రీ హాన్స్ జెహరుట్: "శ్రీసభ నిర్వహించే ప్రతి ప్రధాన వేడుకలో ఇండోనేషియా శ్రీసభ వైవిధ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి మేము కృషి చేస్తాము. వీలైనంత ఎక్కువ ప్రాంతాలకు ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రయత్నిస్తాము."

"శ్రీసభ నిర్వహించే ప్రతి ప్రధాన వేడుకలో ఇండోనేషియా శ్రీసభ వైవిధ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి మేము కృషి చేస్తాము. వీలైనన్ని ఎక్కువ ప్రాంతాలకు ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రయత్నిస్తాము," అని ఆయన అన్నారు.

"ఈ సమావేశ ప్రారంభోత్సవంలో ఉత్తర సుమత్రా సంప్రదాయాలు ప్రధానంగా కనిపించాయి. ముగింపు ప్రదక్షిణలో ఫ్లోరెస్ ప్రాంతానికి చెందిన 'జై' నృత్యం జరిగింది. అలాగే సమర్పణ ఊరేగింపులో జావా సంప్రదాయాలు ప్రతిబింబించాయి. జకార్తా బృహద్దేవాలయంలో జరిగే వేడుకలో కూడా అవే సంప్రదాయాలు ప్రత్యేకంగా ప్రదర్శించబడతాయి," అని వివరించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రేటర్ జకార్తా ఉత్తర సుమత్రా కతోలిక కుటుంబ సంఘం (IKSSU) కేవలం సాంస్కృతిక ప్రదర్శనతోనే పరిమితం కాలేదు. వారి భాగస్వామ్యం అవసరంలో ఉన్న సమాజాలకు ఎన్నో సంవత్సరాలుగా అందిస్తున్న పాస్టరల్ సేవకు, సంఘీభావానికి ప్రతీకగా నిలిచింది.

IKSSUలో టోబా బటాక్, కారో, సిమలుంగున్, నియాస్, పక్‌పక్ తదితర ఉత్తర సుమత్రా జాతి సముదాయాలకు చెందిన కతోలికులు సభ్యులుగా ఉన్నారు.

IKSSU గ్రేటర్ జకార్తా అధ్యక్షుడు లోడెవిక్ సిహిటే మాట్లాడుతూ, తమ సంఘం దుఃఖంలో ఉన్న కుటుంబాలకు తోడ్పాటు అందించడం, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు సహాయం చేయడం, సెమినరీ విద్యార్థులు, కన్యస్త్రీలు, గురువుల ఏర్పాటుకు తోడ్పడడం, జాతి భేదం లేకుండా శ్రీసభ పాస్టరల్ అవసరాలకు స్పందించడం వంటి సేవలను నిశ్శబ్దంగా కొనసాగిస్తోందని తెలిపారు.

"మేము గొప్ప కార్యాలు చేశామని చెప్పడంలేదు. అయితే శ్రీసభ ప్రేషిత సేవ ఎక్కడ అవసరమైతే అక్కడ ఉండేందుకు ప్రయత్నించాము," అని ఆయన అన్నారు.

ఉత్తర సుమత్రాలోని సిబోల్గా మేత్రాసనం ప్రకృతి విపత్తులతో తీవ్రంగా నష్టపోయిన సమయంలో, IKSSU స్థానిక శ్రీసభతో కలిసి సహాయక చర్యల్లో చురుకుగా పాల్గొంది. ఆ సేవను గుర్తించిన FABC నిర్వాహకులు, ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉత్తర సుమత్రాకు ప్రాతినిధ్యం వహించాల్సిందిగా ఈ సంఘాన్ని ఆహ్వానించారు.

ఈ నిర్ణయం వెనుక ఉన్న లోతైన అర్థాన్ని వివరిస్తూ గురుశ్రీ హాన్స్ మాట్లాడుతూ, "ఇటీవలి కాలంలో ఉత్తర సుమత్రాలోని పలు ప్రాంతాలు తీవ్ర ప్రకృతి విపత్తులను ఎదుర్కొన్నాయి. ఈరోజు పాల్గొంటున్న వారిలో చాలామంది పునరావాస కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా సేవలందించారు. కాబట్టి స్వస్థతకు, పునరుద్ధరణకు దేవునికి కృతజ్ఞతలు తెలిపే భావం ఈ వేడుకలో భాగం కావడం ఎంతో సముచితం," అని అన్నారు.

IKSSU యువతకు కూడా ప్రాధాన్యం ఇచ్చింది. పెద్దలపై మాత్రమే ఆధారపడకుండా, యువతకు, చిన్నారులకు ముఖ్యమైన బాధ్యతలు అప్పగించింది. సమర్పణ ప్రదక్షిణలో ఇద్దరు చిన్నారులు కూడా పాల్గొన్నారు.

"వేదికను వారికి అప్పగించే సమయం వచ్చింది," అని సిహిటే అన్నారు.

ప్రారంభోత్సవ కార్యక్రమంలో IKSSU నుంచి మొత్తం 34 మంది పాల్గొన్నారు. వారిలో ముగ్గురు శిక్షకులతో కలిసి పది మంది టోర్టోర్ నృత్యకారులు, సమర్పణ ప్రదక్షిణలో ఆరుగురు, ప్రార్థనలు, సంగీత సేవలో పాల్గొన్న మరికొందరు ఉన్నారు.

ప్రారంభ కార్యక్రమంలో నుసంతర నృత్య బృందం కూడా సుమత్రా, జావా, నుసా తెంగ్గారా ప్రాంతాల సాంప్రదాయ నృత్యాలను ప్రదర్శించింది. రంగురంగుల వస్త్రధారణ, స్థానిక సంగీతం, ప్రాంతీయ నృత్య శైలుల ద్వారా ఇండోనేషియా ద్వీపసముదాయ సాంస్కృతిక వైభవాన్ని ఆసియా ప్రతినిధులకు పరిచయం చేసింది.

సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా టామీ బోలీ లకావోలో "For the Beauty of the Earth" అనే కృతజ్ఞతా గీతాన్ని ఆలపించారు. సృష్టి సౌందర్యానికి, ఆసియా ప్రజలు పంచుకుంటున్న సాంస్కృతిక వారసత్వానికి కృతజ్ఞతలు తెలిపే ఈ గీతం సభికులను ఆకట్టుకుంది.

అత్యంత హృద్యమైన ఘట్టం, దివ్యాంగ గాయని క్రిస్టినా సాంటోసో "Make Me a Channel of Your Peace" అనే గీతాన్ని ఆలపించినప్పుడు ఆవిష్కృతమైంది. అస్సీసి పరిశుద్ధ ఫ్రాన్సిస్ వారికి సమర్పించబడిన ఈ ప్రార్థన, వారధుల నిర్మాణకర్తలుగా మారాలనే సమావేశ పిలుపును మరింత బలపరిచింది. అలాగే శ్రీసభ సేవలో ప్రతి వ్యక్తికి  విలువైన పాత్ర ఉందనే సందేశాన్ని స్పష్టంగా తెలియజేసింది.

ఈ సాంస్కృతిక ప్రదర్శనలన్నీ కలిసి "సినడల్ పరివర్తనకు పిలువబడి, ఆసియాలో వారధులు మరియు వారధుల నిర్మాణకర్తలుగా ఉండే సేవ" అనే సమావేశ ఇతివృత్తాన్ని సజీవంగా ప్రతిబింబించాయి. సినడాలిటీ అనేది కేవలం సంభాషణలో, వివేచనలో మాత్రమే కాకుండా, స్థానిక శ్రీసభల జీవన విశ్వాసం, సేవాభావం, సాంస్కృతిక సంప్రదాయాల ద్వారా కూడా వ్యక్తమవుతుందని అవి చాటిచెప్పాయి.