ముంబై డిజైనర్ సుస్థిరత ద్వారా భక్తి కళను పునర్నిర్మిస్తోంది
ముంబై డిజైనర్ సుస్థిరత ద్వారా భక్తి కళను పునర్నిర్మిస్తోంది
పశ్చిమ భారతదేశంలోని ముంబై నగరంలో, ఒక యువ కతోలిక ప్రోడక్ట్ డిజైనర్ తన సృజనాత్మక పనిలో విశ్వాసం మరియు పర్యావరణ బాధ్యత ఎలా కలిసిపోవచ్చో అన్వేషిస్తోంది.
గిసెల్లి విల్సన్, MIT పూణే నుండి బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ (B.Des) పట్టభద్రురాలు, మొక్కల ఆధారిత పదార్థాలు మరియు పునర్వినియోగ మతపర గ్రంథాలను ఉపయోగించి పర్యావరణానికి అనుకూలమైన భక్తి కళా సృష్టులను అభివృద్ధి చేసింది.
ఆమె పనికి ప్రేరణ లౌదాతోసి అనే పత్రం నుండి వచ్చింది, ఇది పర్యావరణ పరిరక్షణపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలని పిలుపునిస్తుంది. ముంబై అగ్రపీఠం పర్యావరణ కార్యాలయం నిర్వహించిన ఎకో అంబాసడర్ కోర్సు పూర్తి చేసిన తర్వాత, విసిరివేయబడిన పదార్థాలను ఉపయోగకరమైన మరియు ప్రతీకాత్మక వస్తువులుగా మార్చడంపై ఆమె దృష్టి పెట్టింది.
ఆమె ప్రారంభించిన రెండు కార్యక్రమాలు — “రివైవ్ డిజైన్” మరియు “రెన్యూ స్కల్ప్చర్స్ ” — వ్యర్థాలను తగ్గిస్తూ సుస్థిర భక్తి వస్తువులను తయారు చేయడమే లక్ష్యంగా ఉన్నాయి.
గిసెల్లికు ప్రకృతి పట్ల ఉన్న ప్రేమ చిన్ననాటి నుంచే పెరిగింది. నలుగురు సభ్యులతో కూడిన కుటుంబంలో పెరిగిన ఆమె, తన తల్లి వల్ల ప్రకృతి పట్ల ప్రేమ పెరిగిందని చెబుతుంది.
“నా తల్లి ప్రకృతిని ప్రేమించేది. తోటపని చేయడం నుంచి ఆకాశాన్ని చూడటం, పక్షుల కిలకిలారావాలు వినడం వరకు — మేము సృష్టిని ఆస్వాదించడం నేర్చుకున్నాం,” అని ఆమె చెప్పింది.
ఆమె తండ్రి, రిటైర్డ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్, తన పనిలో క్రమశిక్షణతో ముందుకు సాగాలని ప్రోత్సహించారు.
“నేను చిన్నప్పటి నుంచే సృజనాత్మకత కలిగిన పిల్లను. అందుకే ప్రోడక్ట్ డిజైన్ వైపు వెళ్లాను. కానీ భూమికి హాని కలిగించకుండా ఉపయోగపడే వస్తువులు తయారు చేయాలని త్వరలోనే గ్రహించాను,” అని గిసెల్లి వివరించింది.
ఆమె పనిపై ముఖ్యమైన ప్రభావం చూపింది ఆమె గురువు లెస్లీ డిసౌజా. ఆయన ఆధ్యాత్మిక గ్రంథాలను కళారూపాల్లో పునర్వినియోగం చేయాలనే ఆలోచనను పరిచయం చేశారు.
“ఆ ఆలోచన నన్ను బాగా ఆకర్షించింది,” అని ఆమె గుర్తుచేసుకుంది.
ఈ ఆలోచన “రెన్యూ స్కల్ప్చర్స్” అనే ప్రాజెక్ట్గా రూపుదిద్దుకుంది. ఈ ప్రాజెక్ట్కు పేరు పెట్టింది ఆమె విచారణ గురువు గురుశ్రీ రూబెన్ టేల్లీస్ ఆయన లూర్దుమాత దేవాలయంలో సేవలందిస్తున్నారు. ఈ చర్చ్ ఆమెకు అవసరమైన పాత పదార్థాలను సేకరించడంలో సహాయం చేసింది.
అయితే ఈ ప్రయాణం సవాళ్లతో కూడినదే.
“కొన్ని సందర్భాల్లో వదిలేయాలని అనిపించింది. కానీ గ్రంథాలను స్పర్శతో జీవితం ఇవ్వడం ఎంతో అందంగా అనిపించింది,” అని ఆమె చెప్పింది.
గిసెల్లి బైబిల్ డైరీలు వంటి ఉపయోగించని మతపర వస్తువులను ఉపయోగిస్తుంది.
“మతపర గ్రంథాలు మన ఇళ్లలో ఎంతో విలువైనవి. వాటిని ఎలా పారేయాలో చాలామందికి తెలియదు,” అని ఆమె చెప్పింది.
“వ్యర్థం కూడా ఉపయోగపడే వనరు అనే నమ్మకంతో, పేపర్ను కొత్త రూపాల్లో మార్చే మార్గాలను వెతికాను.”
సుస్థిరత ఆమె డిజైన్ తత్వంలో ప్రధానమైనది.
“ప్రతి నిర్ణయం పునర్వినియోగం దృష్టితో తీసుకుంటాను,” అని ఆమె చెప్పింది. “ఈ ఉత్పత్తులు పర్యావరణానికి హానికరం కావు.”
గిసెల్లి తన పనిని విశ్వాసానికి ప్రతిబింబంగా చూస్తుంది.
“మనకు పర్యావరణాన్ని సంరక్షించే బాధ్యత ఉంది,” అని ఆమె చెప్పింది. “భూమి మన అందరి ‘సాధారణ గృహం’. దానిని ప్రేమతో, సహనంతో కాపాడాలి.”
ఆమె పనికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. కొందరు దీన్ని తమ దైనందిన జీవితంలో విశ్వాసాన్ని గుర్తు చేసే సాధనంగా చూస్తున్నారు.
ఒక వినియోగదారు, “ఈ కళాఖండం నాకు ఆత్మశాంతిని ఇస్తుంది. యేసు మా కుటుంబంతో ఉన్నాడని గుర్తు చేస్తుంది,” అని చెప్పారు.
ఇంకొందరు దీన్ని “జాగ్రత్తగా జీవించడం”కు ప్రతీకగా భావిస్తున్నారు.
భవిష్యత్తులో, గిసెల్లి తన ప్రాజెక్టులను మరింత విస్తరించాలని ఆశిస్తోంది.
“మరిన్ని ఆధ్యాత్మిక కళాఖండాలను సృష్టించాలనుకుంటున్నాం,” అని ఆమె చెప్పింది. అలాగే అవసరమైన వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలని కూడా ఆమె ఆశిస్తోంది.
ఈ ప్రయాణంలో తనకు తోడుగా ఉన్నవారికి ఆమె కృతజ్ఞతలు తెలిపింది.
“నా కుటుంబమే నాకు పెద్ద మద్దతు,” అని ఆమె చెప్పింది. “గురువులు, స్నేహితులు, సహచరుల ప్రోత్సాహం నాకు దీవెనగా ఉంది.”
ఆమె పని యువ కథోలికులలో పెరుగుతున్న ఒక దిశను ప్రతిబింబిస్తోంది — సృజనాత్మకతను పర్యావరణ బాధ్యతతో కలిపి, స్థానిక వనరులు మరియు సమాజ సహకారంతో పర్యావరణ మరియు ఆధ్యాత్మిక సమస్యలకు సమాధానాలను కనుగొనడం.