విశ్వజనీన శ్రీసభకు అవసరమైన ప్రత్యేక వరం ప్రతి స్థానిక శ్రీసభలో ఉంది: కార్డినల్ మారియో గ్రెక్

కార్డినల్ మారియో గ్రెక్
జూలై 24న జరిగిన FABC 12వ ప్లీనరీ సమావేశంలో కార్డినల్ మారియో గ్రెక్ మాట్లాడుతూ, విశ్వజనీన శ్రీసభ కోల్పోలేని ప్రత్యేక వరాలు ప్రతి స్థానిక శ్రీసభలో ఉన్నాయని, ఆ వరాలను పరస్పరం పంచుకోవడం ద్వారానే సంఘబంధం మరింత బలోపేతం అవుతుందని ప్రతినిధులకు తెలిపారు.

విశ్వజనీన శ్రీసభ కోల్పోలేని ప్రత్యేక వరాలు ప్రతి స్థానిక శ్రీసభలో ఉన్నాయని పీఠాధిపతుల సినడ్ ప్రధాన కార్యదర్శి కార్డినల్ మారియో గ్రెక్ జూలై 24న జరిగిన Federation of Asian Bishops' Conferences (FABC) 12వ ప్లీనరీ సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులకు తెలిపారు.

జకార్తాలోని హోటల్ ములియా వాండా హాల్లో "సినడ్ అమలు కోసం మార్గాలు" అనే అంశంపై ప్రసంగించిన కార్డినల్ గ్రెక్, సినడాలిటీపై జరిగిన సినడ్ అమలును కేవలం పరిపాలనా ప్రక్రియగా కాకుండా, స్థానిక శ్రీసభలు పరస్పరం తమ వరాలను పంచుకుని ఒకదానినొకటి సుసంపన్నం చేసుకునే అవకాశంగా చూడాలని ఆసియాలోని పీఠాధిపతులకు పిలుపునిచ్చారు.

"ప్రతి వరం ఒక్క శ్రీసభలోనే ఉండదు; అలాగే పంచడానికి ఎలాంటి వరం లేని శ్రీసభ కూడా ఉండదు," అని ఆయన అన్నారు.

కార్డినల్ గ్రెక్ అభిప్రాయం ప్రకారం, ఈ విశ్వాసమే సినడల్ ప్రయాణానికి హృదయం. ప్రతి మేత్రాసనం ఒకే విధమైన సేవాపర విధానాలను అనుసరించాలని ఆశించకుండా, పవిత్రాత్మ ప్రతి స్థానిక శ్రీసభకు అనుగ్రహించిన ప్రత్యేక వరాలు, మిషనరీ అనుభవాలు, సాంస్కృతిక సంప్రదాయాలు, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పరస్పరం గుర్తించి పంచుకోవాలని ఆయన సూచించారు.

సినడ్ విజయాన్ని అది రూపొందించే నివేదికలు, సేవాపర ప్రణాళికలు లేదా పత్రాల సంఖ్యతో కొలవకూడదని ఆయన హెచ్చరించారు.

"మరో పత్రాన్ని రూపొందించడమే లక్ష్యం కాదు. అమలు దశ యొక్క ఉద్దేశ్యం స్థానిక శ్రీసభల మధ్య నిజమైన వరాల పరస్పర వినిమయాన్ని ప్రోత్సహించడమే," అని ఆయన స్పష్టం చేశారు.

సినడ్ తుది పత్రం ప్రచురణతో ప్రక్రియ ముగియలేదని, అది కొత్త దశకు ఆరంభమని కార్డినల్ గ్రెక్ వివరించారు. ఇప్పుడు బాధ్యత మేత్రాసనాలు, స్థానిక శ్రీసభలదేనని, తమ తమ సేవాపర వాస్తవికతల్లో సినడ్ దృక్పథాన్ని ఎలా ఆచరణలోకి తీసుకురావాలో అవి ఆధ్యాత్మిక విచక్షణతో నిర్ణయించుకోవాలని ఆయన అన్నారు.

ఈ ప్రక్రియ పరిపాలనా సంబంధమైనది కాకుండా, మౌలికంగా ఆధ్యాత్మికమైనదని ఆయన నొక్కిచెప్పారు.

పత్రాలు అవసరమైనవే అయినప్పటికీ, అవి శ్రీసభ జీవితానికి సేవ చేయడానికే గాని, దానికి ప్రత్యామ్నాయంగా నిలవడానికి కాదని ఆయన తెలిపారు. నిజమైన సినడల్ పునరుద్ధరణ ప్రార్థన, ఆలకింపు, సంభాషణ, విచక్షణ, సంఘబంధంతో కూడిన సంబంధాల ద్వారా వికసిస్తుందని ఆయన చెప్పారు.

తన ప్రసంగమంతా కార్డినల్ గ్రెక్, "శ్రీసభల సంఘబంధం" అనే భావనను పదేపదే ప్రస్తావించారు. ప్రతి స్థానిక శ్రీసభ విశ్వజనీన శ్రీసభ జీవితానికి అత్యవసరమైన ప్రత్యేకమైన దానిని అందిస్తుందని ఆయన పేర్కొన్నారు.

కార్డినల్ మారియో గ్రెక్
కార్డినల్ మారియో గ్రెక్ మాట్లాడుతూ, సినడ్ తుది పత్రం ప్రచురణతో ప్రక్రియ ముగియలేదని, అది కొత్త దశకు నాంది పలికిందని తెలిపారు. ఇప్పుడు స్థానిక శ్రీసభలు తమ సేవాపర వాస్తవికతలకు అనుగుణంగా సినడల్ దృక్పథాన్ని ఆచరణలోకి తీసుకువచ్చే ప్రయాణాన్ని ప్రారంభించాల్సిన సమయం వచ్చిందని ఆయన వివరించారు.

ఉదాహరణకు, ఆసియాలో అల్పసంఖ్యాకులుగా ఉన్న శ్రీసభల మిషనరీ స్థైర్యం, లౌకికవాదం లేదా ఇతర సేవాపర సవాళ్లను ఎదుర్కొంటున్న ప్రపంచంలోని ఇతర శ్రీసభలకు విలువైన పాఠాలను అందిస్తుందని ఆయన అన్నారు. అదే సమయంలో, ఆసియాలోని శ్రీసభలు కూడా ఆఫ్రికా, లాటిన్ అమెరికా, యూరప్, ఓషియానియా ప్రాంతాల్లో రూపుదిద్దుకుంటున్న సేవాపర అనుభవాలు, కార్యక్రమాల నుంచి నేర్చుకోవచ్చని తెలిపారు.

"ఈ సంబంధం పరస్పరమైనది," అని ఆయన చెబుతూ, ప్రతి శ్రీసభ ఒకేసారి బోధించేదిగానూ, నేర్చుకునేదిగానూ ఉంటుందని వివరించారు.

కార్డినల్ గ్రెక్ అభిప్రాయం ప్రకారం, ఈ పరస్పర సమృద్ధియే శ్రీసభ యొక్క విశ్వజనీనతకు అత్యంత స్పష్టమైన వ్యక్తీకరణ.

2028లో జరగనున్న ఎక్లెసియల్ అసెంబ్లీ వైపు దృష్టి సారిస్తూ, రాబోయే సంవత్సరాలను స్వీకరణ, విచక్షణ, పరస్పర అధ్యయన కాలంగా ఆయన అభివర్ణించారు. ప్రపంచవ్యాప్తంగా స్థానిక శ్రీసభల నుంచి వెలువడుతున్న అనుభవాలు, ఆలోచనలను ఆ సమావేశం ఒకచోట చేర్చి, పరస్పరం సుసంపన్నం చేసుకుంటూ శ్రీసభ సంఘబంధం, సేవను మరింత బలోపేతం చేయడానికి దోహదపడుతుందని ఆయన వివరించారు.

చివరగా, శ్రీసభ కేవలం నిర్మాణాల వల్ల కాకుండా, సువార్త స్ఫూర్తితో రూపుదిద్దుకున్న సంబంధాల ద్వారానే నిజంగా అభివృద్ధి చెందుతుందని గుర్తుచేస్తూ కార్డినల్ గ్రెక్ తన సందేశాన్ని ముగించారు.