కాస్టెల్ గాండోల్ఫో నుండి ప్రపంచానికి సందేశాన్ని అందించిన పోప్ లియో
వేసవి విశ్రాంతి సమయంలో పోప్ లియో చాలా పరిమిత సంఖ్యలోనే ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
అలాంటి కార్యక్రమాల్లో భాగంగా,జూలై 12 న కాస్టెల్ గాండోల్ఫోలో నిర్వహించిన తన తొలి ఏంజెలస్ ప్రార్థన సందర్భంగా ప్రపంచంలో పెరుగుతున్న యుద్ధాలు, హింసాత్మక పరిస్థితుల మధ్య శాంతి, ఆశ, దౌత్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని పోప్ లియో ప్రపంచ నాయకులకు పిలుపునిచ్చారు.
మధ్యప్రాచ్యం, ఉక్రెయిన్తో పాటు ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో యుద్ధం కొనసాగుతూనే ఉంది అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘర్షణలు అమాయక ప్రజల ప్రాణాలను బలితీసుకుంటూ, భయం, హింస, మరణాన్ని వ్యాప్తి చేస్తున్నాయని అన్నారు.
అయితే, ఎంత క్లిష్ట పరిస్థితులు ఎదురైనా ఆశ, శాంతి అనే జ్యోతి ఆరిపోకుండా కాపాడాలని, సంభాషణ, పరస్పర అవగాహన, దౌత్య మార్గాల ద్వారానే శాశ్వత శాంతిని సాధించవచ్చని పోప్ స్పష్టం చేశారు.
జూలై రెండవ ఆదివారం సందర్భంగా కతోలిక శ్రీసభ సముద్రంలో సేవలందించే నావికులు, మత్స్యకారులు, ఓడరేవు కార్మికుల కోసం ప్రత్యేకంగా ప్రార్థించే సంప్రదాయాన్ని పాటిస్తుంది. ఈ సందర్భంగా పోప్ లియో వారందరికీ తన ప్రార్థనలను అర్పించారు.
కుటుంబాలకు దూరంగా ఉంటూ, సముద్రాల్లో నెలకొన్న ప్రమాదాలు, సంఘర్షణలను ఎదుర్కొంటూనే ప్రపంచ వాణిజ్యాన్ని ముందుకు నడిపిస్తున్న నావికులు, మత్స్యకారులు, ఓడరేవు కార్మికుల సేవలను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు.
విశ్వాసులను పోప్మొబైల్లో అభివాదం చేయడానికి ముందు, యేసు ప్రభువు చెప్పిన విత్తువాని ఉపమానంపై కూడా పోప్ ధ్యానాంశాన్ని పంచుకున్నారు.
వేసవి సెలవులను కేవలం విశ్రాంతి కోసం మాత్రమే కాకుండా, దేవుని వాక్యాన్ని చదవడానికి, వినడానికి, ధ్యానించడానికి కూడా ఉపయోగించుకోవాలని ఆయన విశ్వాసులను ప్రోత్సహించారు.