"రోమ్ స్థానిక శ్రీసభ స్థానాన్ని భర్తీ చేయదు": FABC ప్రతినిధులకు సినడ్ అధికారి సందేశం

గురుశ్రీ జియాకోమో కోస్టా, SJ
FABC 12వ ప్లీనరీ సమావేశంలో వేటికన్‌కు చెందిన సినడ్ అధికారి మాట్లాడుతూ, సినడాలిటీపై సినడ్ అమలు ప్రక్రియ స్థానిక శ్రీసభలు విశ్వజనీన శ్రీసభతో సంఘబంధంలో కొనసాగుతూ, తమ స్వంత మార్గాన్ని ఆధ్యాత్మిక విచక్షణతో గుర్తించి ముందుకు సాగేలా వాటిని శక్తివంతం చేస్తుందని తెలిపారు.

సినడాలిటీపై సినడ్ అమలు అనేది రోమ్ నుంచి స్థానిక శ్రీసభలను నియంత్రించే ప్రక్రియ కాదని, విశ్వజనీన శ్రీసభతో సంఘబంధంలో కొనసాగుతూ తమ స్వంత మార్గాన్ని ఆధ్యాత్మిక విచక్షణతో గుర్తించేలా స్థానిక శ్రీసభలను శక్తివంతం చేయడమేనని వేటికన్ సినడ్ అధికారి గురుశ్రీ జియాకోమో కోస్టా, SJ తెలిపారు.

పీఠాధిపతుల సినడ్ ప్రధాన కార్యదర్శిత్వానికి సంప్రదింపుదారుగా, ప్రపంచ సినడల్ ప్రక్రియలో ప్రధాన సహకారిగా ఉన్న గురుశ్రీ కోస్టా, జూలై 24న జకార్తాలోని హోటల్ ములియా వాండా హాల్లో జరిగిన Federation of Asian Bishops' Conferences (FABC) 12వ ప్లీనరీ సమావేశంలో "సినడ్ అమలు కోసం మార్గాలు" అనే అంశంపై ప్రసంగిస్తూ ఈ సందేశాన్ని అందించారు.

ఆసియా నలుమూలల నుంచి వచ్చిన పీఠాధిపతులు, శ్రీసభ నాయకులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, సినడ్ తదుపరి దశ విజయవంతం కావడం వేటికన్ నుంచి మరింత కట్టుదిట్టమైన మార్గనిర్దేశంపై కాకుండా, పవిత్రాత్మ తమ పరిస్థితుల్లో సువార్తను ఎలా జీవించమని పిలుస్తున్నాడో గుర్తించే బాధ్యతను స్థానిక శ్రీసభలు స్వీకరించడంపైనే ఆధారపడి ఉంటుందని చెప్పారు.

"రోమ్ స్థానిక శ్రీసభల బాధ్యతను భర్తీ చేయదు," అని ఆయన స్పష్టం చేశారు. పీఠాధిపతుల సినడ్ ప్రధాన కార్యదర్శిత్వం పాత్ర స్థానిక మేత్రాసనాలు తమ సినడల్ ప్రయాణాన్ని కొనసాగించే క్రమంలో వాటికి తోడ్పాటు అందించడం, సహకరించడం, అవసరమైన వనరులను సమకూర్చడం మాత్రమేనని వివరించారు.

తన ప్రసంగానికి పునాదిగా పరిశుద్ధ పిత లియో XIV కార్డినల్స్ మండలికి ఇటీవల పంపిన సందేశాన్ని గురుశ్రీ కోస్టా ప్రస్తావించారు. సినడ్ అమలు దశను అర్థం చేసుకోవడానికి ఆ సందేశమే కీలకమని ఆయన అన్నారు.

మరో శ్రీసభ కార్యక్రమాన్ని ప్రారంభించమని కాదు, తమకు అప్పగించబడిన శ్రీసభల్లో సినడ్ అమలు ప్రక్రియను "దృఢ విశ్వాసంతో" ముందుకు నడిపించాలని, దేవుని ప్రజలు "మరింత సువార్తస్ఫూర్తితో కూడిన జీవన విధానంలో" ఎదగడానికి తోడ్పడాలని పరిశుద్ధ పిత పీఠాధిపతులను ఆహ్వానించారని ఆయన గుర్తుచేశారు.

ఈ దృక్పథం ఒక ముఖ్యమైన మార్పును సూచిస్తుందని గురుశ్రీ కోస్టా వివరించారు.

"అమలు దశ అనేది వేటికన్ నుంచి వచ్చిన సూచనలను పరిపాలనా నిబంధనల్లా అమలు చేయడం కాదు. ప్రతి స్థానిక శ్రీసభ తన చరిత్ర, సంస్కృతి, సేవాపర వాస్తవికతల మధ్య పవిత్రాత్మ తన ప్రజలను ఎలా నడిపిస్తున్నాడో ఆధ్యాత్మిక విచక్షణతో గుర్తించేలా చేయడమే దాని లక్ష్యం," అని ఆయన చెప్పారు.

పీఠాధిపతుల సినడ్ ప్రధాన కార్యదర్శిత్వం విడుదల చేసిన సినడ్ తుది పత్రం, అమలు మార్గదర్శకాలు, ఆచరణాత్మక సూచనలు వంటి పత్రాలు శ్రీసభ ప్రయత్నాల కేంద్రంగా మారకూడదని ఆయన స్పష్టం చేశారు.

"నిజమైన కేంద్రం శ్రీసభ జీవితం, సేవే," అని ఆయన అన్నారు.

ఆ పత్రాలు స్థానిక విశ్వాస సమాజాలకు సేవ చేయడానికి ఉద్దేశించినవేనని, వాటి ఆధ్యాత్మిక విచక్షణను భర్తీ చేయడానికి కాదని ఆయన వివరించారు. వాటిని యాంత్రికంగా అమలు చేయకుండా, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అనుసరించాలని సూచించారు.

సువార్త ప్రకటించబడే, విశ్వాసం జీవించబడే, మిషనరీ శిష్యులు తీర్చిదిద్దబడే ప్రధాన స్థలంగా స్థానిక శ్రీసభపై మళ్లీ విశ్వాసాన్ని పునరుద్ధరించడం సినడ్ సాధించిన అత్యంత ముఖ్యమైన ఫలితాలలో ఒకటని గురుశ్రీ కోస్టా పేర్కొన్నారు.

అదే సమయంలో, స్థానిక శ్రీసభ ప్రాధాన్యాన్ని నొక్కిచెప్పడం అంటే స్వతంత్రత లేదా ఏకాంత ధోరణిని ప్రోత్సహించడం కాదని ఆయన హెచ్చరించారు.

"శ్రీసభ అనేది శ్రీసభల సంఘబంధం," అని ఆయన పేర్కొంటూ, స్థానిక శ్రీసభలు పరస్పర అనుభవాలు, సంభాషణ, సహకారం ద్వారా ఒకదానినొకటి నేర్చుకుంటూ అభివృద్ధి చెందుతాయని వివరించారు.

అందుకే మేత్రాసనాలు, పీఠాధిపతుల సమాఖ్యలు, ఖండస్థాయి సమావేశాలు, విశ్వజనీన శ్రీసభ మధ్య నిరంతర సహకారాన్ని సినడ్ ప్రోత్సహిస్తోందని ఆయన తెలిపారు.

ఈ సంబంధాన్ని గురుశ్రీ కోస్టా పర్యవేక్షణగా కాకుండా తోడ్పాటుగా అభివర్ణించారు. స్థానిక శ్రీసభలు కలిసి ఆలోచించేందుకు, పవిత్రాత్మ చేస్తున్న కార్యాన్ని ఆనందంగా గుర్తించి జరుపుకోవడానికి, విశ్వజనీన శ్రీసభతో సంఘబంధంలో భవిష్యత్ సేవాపర ప్రాధాన్యాలను ఆధ్యాత్మిక విచక్షణతో నిర్ణయించేందుకు ప్రధాన కార్యదర్శిత్వం సహకరిస్తుందని వివరించారు.

సినడల్ శ్రీసభలో పీఠాధిపతుల పాత్ర కూడా కొత్త రూపు దాలుస్తోందని ఆయన తెలిపారు. కేవలం ఆదేశాలను అమలు చేసే పరిపాలకులుగా కాకుండా, సంఘబంధాన్ని పెంపొందించే నాయకులుగా, భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే కాపరులుగా, దేవుని ప్రజలు కలిసి పవిత్రాత్మ కార్యాన్ని గుర్తించే అవకాశాలను సృష్టించే వారిగా పీఠాధిపతులు వ్యవహరించాలని ఆయన సూచించారు.

ఆసియాలోని విభిన్న మత, సాంస్కృతిక నేపథ్యాల్లో అల్పసంఖ్యాక కతోలిక సమాజాలకు సేవలందిస్తున్న FABC సమావేశంలోని అనేక మంది పీఠాధిపతులకు ఈ సందేశం ప్రత్యేక ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

ఆసియా వైవిధ్యభరితమైన ఖండం కావడంతో ప్రతి శ్రీసభకు ఒకే సేవాపర నమూనా ఉండదని గురుశ్రీ కోస్టా అన్నారు. ప్రతి స్థానిక శ్రీసభ తన పరిస్థితులకు అనుగుణంగా సినడాలిటీ ఎలా వేళ్లూనుకోవాలో గుర్తిస్తూ, అదే సమయంలో విశ్వజనీన శ్రీసభతో సంపూర్ణ సంఘబంధంలో కొనసాగాలని ఆయన తెలిపారు.

కొత్త నిర్మాణాలు లేదా మరిన్ని పత్రాలు కాదు; తమ సేవను ధైర్యంగా స్వీకరించి, కలిసి ఆధ్యాత్మిక విచక్షణతో ముందుకు సాగుతూ, సమస్త శ్రీసభతో సంఘబంధంలో సువార్తను జీవించే స్థానిక శ్రీసభల ద్వారానే సినడ్ భవిష్యత్తు రూపుదిద్దుకుంటుందనే ప్లీనరీ సమావేశంలోని ప్రధాన భావనను గురుశ్రీ కోస్టా తన ప్రసంగంలో మరింత బలపరిచారు.