తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు


తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు

ఎండలు మండిపోతున్నాయి.. ఉక్కపోతతో బయటకు వెళ్లాలంటేనే జనం అల్లాడిపోయారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వేడిగాలితో జనం భయాందోళన చెందుతున్నారు. ఉదయం 9 గంటలు దాటిందంటే బయటకు రావాలంటేనే భయమేస్తుంది.

గత మూడు రోజులుగా సూర్యుడి ప్రతాపం కనిపిస్తోంది.. ఉక్కపోతు, వేడి గాలులతో జనాలు అల్లాడిపోతున్నారు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.. మంగళవారం కూడా అధిక ఉష్ణోగ్రతల ప్రభావం ఉంటుందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఈరోజు 9 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 194 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు. 

నెల్లూరు జిల్లా కొండాపురంలో 46.4°Cలు, ప్రకాశం జిల్లా జరుగుమల్లిలో 46.2°Cలు అధిక ఉష్ణోగ్రతలు నమోదైంది. 

ఈరోజు  మగళవారం నాడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయగోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45°C - 48°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు.  విశాఖపట్నం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42°C - 44°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు. 
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని ,అవసరమైతే తప్ప బయటకు వెళ్లరాదని సూచించారు. 

ముఖ్యంగా వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రయాణాల్లో కూడా తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు.వడ దెబ్బ తగులకుండా ప్రజలు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, ఉదయం, సాయంత్రం ప్రయాణాలు సాగించాలని వైద్యులు సూచిస్తున్నారు. 

ఎండలో తిరగడం వల్ల వడదెబ్బకు గురవుతారు. శరీరంలో ఉష్ణోగ్రత పెరగకుండా చూసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. బయటకు వెళ్లాల్సి వస్తే ఎప్పటికప్పుడు  మంచి నీరు,కొబ్బరి నీళ్లు, పళ్ళ రసాలు తాగుతువుండాలి.  ముఖ్యంగా కలుషిత ఆహారానికి దూరంగా ఉండాలి. ఆకస్మికంగా పెరిగే ఉష్ణోగ్రత వల్ల జ్వరం బారిన పడతారు. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే పిల్లలకు చికెన్‌పాక్స్‌ సోకుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కల్తీనూనె,కలుషిత నీటి వల్ల పచ్చకామెర్లు, డయేరియా వంటి వ్యాధులు ప్రబలుతాయి.