
విజయవాడ పీఠంలో గురుపట్టాభిషేక మహోత్సవము
విజయవాడ పీఠానికి చెందిన నలుగురు డీకన్లను (మొండ్రు రమేష్, బొడ్డు వినయ్, కుర్రెళ్ళ వినోద్, అందుగల శ్రీకాంత్) 27 జూన్ 2022 సా:5:00 గం||లకు,పటమట,సెయింట్ పౌల్స్ కాథెడ్రల్ నందు మహా పూజ్య .తెలగతోటి జోసెఫ్ రాజారావు తండ్రి గారు గురువులుగా అభిషేకించి ఆశీర్వదించారు.
గురువుయొక్క ప్రేషిత పరిచర్య-సేవ యాజకత్వం అనేది దైవానుగ్రహం. అంతెకాక "గురువుగా మన పిలుపు మన సంఘమునుండి వచ్చినదే, ఈ పిలుపు సంఘానికి, శ్రీసభకు పరిచర్యచేయుటకే" అని నొక్కి వక్కాణించారు.
క్రీస్తు ప్రభువు నిత్య శాశ్వత జీవి, నిత్య యాజకుడు అనగా ఆయన మానవుల పాప పరిహారార్థం ఒకేఒక్కసారి అర్పించిన కలువరి బలి ద్వారా వారసత్వంగా అందించిన గొప్ప వరమే గురుత్వం, ఆ విలువను గుర్తించి కొనసాగించాలని గుర్తుచేసారు.
గురుత్వం అనేది పవిత్రతకు పిలుపు కాబట్టి ఆ పిలుపును అందుకున్న గురువు నిస్వార్ధపరుడై ఉండాలి, నిర్దోషిగా ఉండాలి, అధర్మాన్ని ఖండించాలని మేత్రానులవారు తెలియచేసారు.
క్రీస్తు ప్రభువు మానవాళికి రెండు రకాల యాజకత్వాని ఇచ్చారని, మొదటిది విశ్వాసులందరికి జ్ఞానస్నానము ద్వారా యాజకత్వం, రెండవది సేవా యాజకత్వము అది గురులకు మాత్రమే ఇచ్చిన పవిత్ర పిలుపు.
అందుకే గురువు మూడు లక్షణాలు కలిగి ఉండాలి
* ప్రవక్తగా
* యాజకుడుగా
* రాజుగా ఉండాలి
ఈ మూడు లక్షణాలు పరిపూర్ణతగావించబడాలంటే " చదివిన దానిని నమ్మాలి, నమ్మిన దానిని పాటించాలి, ప్రకటించాలి ".
క్రీస్తు గొప్ప కాపరి, మంచి కాపరి, గాయాలు తగిలిన కాపరి, బాధలను అనుభవించిన కాపరి.
క్రీస్తు ప్రభువు ప్రజలు ఎదురుచూసిన మెస్సయ్య అలాగే గురువు సంఘాలు ఎదురుచూసే ఆచార్యుడుగా మారాలి.
క్రీస్తు ప్రభువు తన ప్రేషిత కార్యంలో భాగంగా జీవితాంతం బ్రహ్మచర్యాన్ని పాటించి మార్గచూపరియైన మహోన్నతుడు . కాబట్టి ప్రతీ గురువు జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటూ దైవ రాజ్య స్థాపనకు పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయముతో దేవునిలో ఐక్యమై ఎల్లపుడు ప్రార్ధన చేస్తూ పవిత్రంగా జీవిస్తూ సంఘాలకు మాతృకగా ఉండాలి .
మేత్రాణులతో పాటు మేత్రాసన గురువులందరూ నూతన గురువులను ఆశీర్వదించి ఆశీస్సులను అందచేసారు.
చివరిగా వికార్ జనరల్ గురుశ్రీ మువ్వల ప్రసాద్ గారు విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియచేసారు.
నూతన గురువులు గురుత్వపు అంతస్తును గుర్తుంచుకొని, ప్రజలను విశ్వాసములో పెంచాలని అమృతవాణి రేడియో వెరితాస్ ఆసియా తెలుగు విభాగం వారు కోరుకుంటున్నారు.

Add new comment