Radio Veritas Asia Buick St., Fairview Park, Queszon City, Metro Manila. 1106 Philippines | + 632 9390011-15 | +6329390011-15
యవ్వనదశలో సమతులాహారం తీసుకోవాలి- ప్రొఫెసర్ డాక్టర్ ఎం.సుహాసిని
యువతీయువకులు యవ్వనదశలో సమతులాహారం తీసుకోవాలని, ఆరోగ్య నియమాలు పాటించాలని చిన్నపిల్లల వైద్యనిపుణురాలు ప్రొఫెసర్ డాక్టర్ ఎం.సుహాసిని గారు పేర్కొన్నారు. మంగళవారం ఏలూరులోని తెలుగు రాష్ట్రాల కథోళిక యువతా సదస్సులో ఆమె ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కౌమార, యవ్వన దశలు జీవితంలో చాలా ముఖ్యమైనవని ఈ వయస్సులో పాటించే అలవాట్లు జీవితాంతం కొనసాగిస్తారన్నారు.
యవ్వనం ఒక వరం..
యవ్వనం ఒక అవకాశం..
యవ్వనం ఒక నినాదం..
యవ్వనం ఒక ప్రమాదం కూడా అని తెలిపారు.
సద్వినియోగం చేసుకుంటే యవ్వనం ఓ మధురమైన కల అని, అదే శృతి తప్పిందా సముద్రంపై లేచే రాకాసి అల అని గుర్తు చేశారు.
యువతీయువకుల ఆలోచనలు సన్మార్గంలో ఉండాలని, ఆధ్యాత్మికతను, సామాజికతను కలుపుకొని ముందుకు సాగాలన్నారు. నేటి యువత ముందుతరాలకు, రాబోయే తరాలకు వారధులని, సృష్టి వికాసంలో ప్రత్యేకమైనది యువతేనన్నారు. ఇప్పుడు మంచి ఆహారం తీసుకుంటేనే పుట్టబోయే పిల్లలు ఆరోగ్యంగా పుడతారని, ఆరోగ్య భారతదేశం తయారవుతుందన్నారు.
ప్రార్థన నిత్యజీవితంలో భాగం కావాలని, గొప్ప ఆశయాలతో ముందుకు సాగాలన్నారు. అనంతరం ప్రాంతీయ యువతా సభ్యులు, రీజనల్ యూత్ డైరెక్టర్ డాక్టర్ సుహాసినీ గారిని ఘనంగా సన్మానించారు..
Add new comment