Radio Veritas Asia Buick St., Fairview Park, Queszon City, Metro Manila. 1106 Philippines | + 632 9390011-15 | +6329390011-15
స్పూర్తిదాయక ప్రసంగంతో ఆకట్టుకున్న వినిశా ఉమాశంకర్
Tuesday, November 09, 2021
స్పూర్తిదాయక ప్రసంగంతో ఆకట్టుకున్న వినిశా ఉమాశంకర్ :
వాతావరణ మార్పులు, పర్యావరణ పరిరక్షణ దిశగా గ్లాస్గోలో జరుగుతున్న కాప్ 26 సదస్సులో భారత్తో సహా 120 దేశాల నాయకులు పాల్గొంటున్నారు. కాప్-26 స్కాట్లాండ్లోని గ్లాస్గోలో నవంబర్ 1 నుంచి 12 వరకు జరుగుతోంది. 2050 కల్లా దేశాలు కార్బన్ న్యూట్రల్గా మారాలన్నది COP-26 సదస్సు ప్రధాన లక్ష్యం. చైనా, అమెరికా, ఈయూల తరువాత అధిక కర్బన ఉద్గారాల దేశాల్లో భారత్ నాలుగో స్థానంలో ఉంది.
2070 కల్లా భారత్ కార్బన్ న్యూట్రల్గా మారుతుందని గ్లాస్గో సదస్సులో ప్రధాని మోదీ ప్రకటించారు. కార్బన్ న్యూట్రల్గా మారడం అంటే. ఉత్పత్తి అవుతున్న ఉద్గారాలను, నిర్మూలిస్తున్న ఉద్గారాలను సమానం చేయడాన్నే నెట్ జీరో అంటారు. ప్రపంచంలో అత్యధిక కర్బన ఉద్గార దేశం చైనా 2060 నాటికి తాము కార్బన్ న్యూట్రల్గా మారతామని ఇప్పటికే ప్రకటించింది.అమెరికా, యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాలు 2050 నాటికి నెట్ జీరోకి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.
భారత్కు చెందిన 14 ఏళ్ల వినిశా ఉమాశంకర్ స్పూర్తిదాయక ప్రసంగంతో ప్రపంచ దేశాల అధినేతలను ఆకట్టుకుంది. వినిశా ఉమాశంకర్ తమిళనాడు లోని తిరువణ్ణామలై జిల్లాకు చెందినది. ప్రధాని మోదీ సహా ప్రపంచ దేశాధినేతలు పాల్గొన్న ఈ సదస్సులో వినిశా తన అభిప్రాయాలను నిర్భయంగా వెల్లడించారు. మీరు ఇచ్చిన వట్టి హామీలు.. వాటిని అమలు చేయని నేతల పట్ల మా తరంలోని చాలామంది ఆగ్రహంతోనూ, విసుగెత్తి ఉన్నారు .. అయినా.. ఆగ్రహం వ్యక్తం చేసేంత సమయం నాకు లేదు. నేను భారత పుత్రికను మాత్రమే కాదు, పుడమి పుత్రికను.. ఇందుకు నేను గర్విస్తున్నా’’ అని వినిశా స్పష్టం చేశారు. వినిశా ఉమాశంకర్ ప్రసంగం వీడియోను సుప్రియా సాహు అనే ఐఏఎస్ అధికారి ట్విట్టర్లో షేర్ చేయడం జరిగింది.
Add new comment